మరోసారి వార్తల్లోకి ఎక్కిన వనజాక్షి
గుంటూరు: విజయవాడ రూరల్ తహశీల్దార్ డీ వనజాక్షి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటి దెందులూరు శాసన సభ్యుడు చింతమనేని ప్రభాకర్ చేతిలో దాడికి గురైన వనజాక్షి.. తాజాగా తహశీల్దార్ల అసోసియేషన్ గౌరవాధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ తహశీల్దార్ల అసోసియేషన్ (ఆప్టా) గౌరవాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. గుంటూరు జిల్లా చినకాకానిలో తహశీల్దార్ల అసోసియేషన్ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆప్టా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆప్టా అధ్యక్షుడిగా బీ రజినీకాంత్ ను ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఆయన హైకోర్టు లైజనింగ్ అధికారిగా పని చేస్తున్నారు. అసోసియేట్ అధ్యక్షుడిగా వీ శ్రీనివాసులరెడ్డి ప్రధాన కార్యదర్శిగా పీ భాస్కరరావు ఎన్నికయ్యారు. ప్రస్తుతం వారిద్దరూ తాడేపల్లి, పిడుగురాళ్ల తహశీల్దార్లుగా ఉన్నారు.
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రయత్నించిన వనజాక్షిపై తెలుగుదేశం పార్టీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో ఆమె పేరు రాష్ట్రంలో మారుమోగిపోయింది. ఇసుక మాఫియాను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆమెను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని దాడి చేయడం అప్పట్లో రాష్ట్రంలో కలకలం రేపింది. రాజకీయ దుమారానికి దారి తీసింది. క్రమంగా ఆ ఘటనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వినియోగించుకుంది.

టీడీపీ హయాంలో ఇసుక మాఫియా ఏ రకంగా చెలరేగిపోయిందనడానికి ఉదాహరణగా వనజాక్షిపై చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన ఘటను చూపిస్తూ వచ్చింది. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించిన తనకు రెవెన్యూ అధికారుల సంఘం గానీ, తహశీల్దార్ల అసోసియేషన్ ప్రతినిధులు గానీ, ఏపీ ఎన్జీవోలు గానీ తనకు అండగా రాలేదంటూ వనజాక్షి అప్పట్లో ఆవేదనను వ్యక్తం చేశారు. అలాంటి తహశీల్దార్ల అసోసియేషన్ కు ఆమె తాజాగా గౌరవ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షురాలిగా ఎంపిక కావడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని వనజాక్షి వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications