ప్రయాణికులకు శుభవార్త.. వందేభారత్ స్థానంలో వందే సాధారణ్
భారతీయులకు, భారతీయ రైల్వేకు విడదీయరాని అనుబంధం ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక సౌకర్యాలను కల్పిస్తూ ప్రయాణికులను ఆకట్టుకోవడంలో రైల్వే ముందుంది. ఎక్కువ దూరాన్ని సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో సురక్షితంగా ప్రయాణం ఉండటంతో ప్రజంతా మొదటి ప్రాధాన్యత కింద రైలునే ఎంపిక చేసుకుంటారు. ఇటీవలే సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ పట్టాలెక్కిన సంగతి తెలిసిందే.

వందే భారత్ కు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ దక్కుతోంది. ఆక్యుపెన్సీ కూడా ఊహించని విధంగా ఉండటంతో అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే కొన్ని కొన్ని ప్రాంతాల్లో వందే భారత్ ఛార్జీలు ఎక్కువగా ఉంటున్నాయని ప్రయాణికుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. దీంతో స్లీపర్ సౌకర్యంతో, ప్రజల ప్రయాణాన్ని తక్కువ ఖర్చుతో చేసేలా త్వరలోనే వందే సాధారణ్ రైళ్లను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ రైళ్లు రూ.65 కోట్ల అంచనా వ్యయంతో చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారవుతున్నాయి. తొలి రైలు ఈ ఏడాది చివరలో పట్టాలెక్కే అవకాశం ఉంది.

ఒక రైలు తయారవడానికి దాదాపు రూ.100 కోట్లు ఖర్చవుతుంది. వందే సాధారణ్ రైలులో మొత్తం 24 బోగీలను ఏర్పాటు చేస్తున్నారు. అవన్నీ కూడా ఎల్ హెచ్ బీ కోచ్ లే ఉంటాయి. రెండు లోకోమోటివ్స్ ఉంటాయి. బయో వాక్యూమ్ టాయ్ లెట్స్, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఛార్జింగ్ పాయింట్, ప్రతి కోచ్ లో సీసీటీవీ కెమెరా, ఆటోమేటిక్ డోర్ సిస్టం కల్పించనున్నారు. వందే భారత్ ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వందే సాధారణ్ రైళ్లల్లో కూడా ఛార్జీలు ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. అయితే వందే సాధారణ్ రైళ్ల ఛార్జీలు సాధారణ రైళ్లకు ఉండే ఛార్జీలే వర్తించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొదటి రైలు పట్టాలెక్కినప్పుడే దీనిపై ఒక స్పష్టత రానుంది.












Click it and Unblock the Notifications