దిశా పెట్రోలింగ్ వాహనాలు ప్రారంభిస్తే అత్యాచారాలు ఆగిపోతాయా? జగన్ కు అనిత సూటిప్రశ్న
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు దిశా పెట్రోలింగ్ వాహనాలను ప్రారంభించారు. 163 ఫోర్ వీలర్ దిశ పెట్రోలింగ్ వాహనాలకు సచివాలయం ప్రధాన గేటు వద్ద జెండా ఊపి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా మహిళలపై అన్యాయం జరిగితే ప్రభుత్వం ఊరుకోదు అని సీఎం జగన్ వెల్లడించారు. దిశ యాప్ ద్వారా ఫిర్యాదు అందితే పది నిమిషాల్లోనే సహాయం అందేలా ప్రయత్నం చేస్తున్నామని సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
వైసీపీ పాలనలో మహిళల భద్రత ప్రశ్నార్ధకం: అనిత
ఇక మహిళల రక్షణ కోసం దిశా పెట్రోలింగ్ వాహనాలను ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డిని టిడిపి నాయకులు వంగలపూడి అనిత టార్గెట్ చేశారు. వైసిపి పాలనలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత పేర్కొన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన వంగలపూడి అనిత జగన్ రెడ్డి కల్తీ మద్యానికి మహిళల మాంగల్యాలు బలైపోతున్నాయని, జంగారెడ్డి గూడెం లో ఇటీవల చోటుచేసుకున్న మరణాలన్నీ కల్తీసారా మరణాలే అని పేర్కొన్నారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే వంగలపూడి అనిత తేల్చిచెప్పారు.
కల్తీసారాను, జే బ్రాండ్ మద్యాన్ని ఒక పధకంలాగా అమలు చేస్తున్నారు
ప్రజల ప్రాణాలంటే వైసీపీ నేతలకు లెక్క లేదని మండిపడిన అనిత రాష్ట్రంలో కల్తీసారాను, జే బ్రాండ్ మద్యాన్ని ఒక పధకం లాగా అమలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తండ్రి శవం పక్కనే కూర్చుని సీఎం కుర్చీ కోసం సంతకాలు సేకరించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అని ఆగ్రహం వ్యక్తం చేసిన వంగలపూడి అనిత జగన్ అరాచక పాలన తో రాష్ట్రం లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి అన్నారు. దిశ యాప్ తెచ్చి, దిశ పెట్రోలింగ్ వాహనాలు ప్రారంభిస్తే అత్యాచారాలు ఆగిపోతాయా జగన్ రెడ్డి అంటూ ప్రశ్నించారు.
ప్రభుత్వ ఉదాసీనత వల్ల మృగాళ్లు చెలరేగిపోతున్నారు
నాటు సారా ప్రబలి నేరాలు పెరిగిపోతున్నాయని, ప్రభుత్వ ఉదాసీనత వల్ల మృగాళ్లు చెలరేగిపోతున్నారని వంగలపూడి అనిత మండిపడ్డారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా కమిషన్ పని చేస్తుందా అని ప్రశ్నించిన అనిత, రాష్ట్రంలో మహిళా హోం మంత్రి ఉండి కూడా ప్రయోజనం లేదన్నారు. ఆడబిడ్డలకు రక్షణ కల్పించలేని మహిళా హోం మంత్రి ఎందుకు అంటూ వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మృగాళ్ల చేతిలో రోజుకు ఆడబిడ్డలు బలైపోతుంటే దిశా వాహనాలు దేనికి జగన్ రెడ్డి అంటూ అనిత జగన్ కు సూటి ప్రశ్న వేశారు.
జగన్ పాలనలో మహిళల మనుగడే ప్రశ్నార్ధకం
జగన్ మోహన్ రెడ్డి పాలన లో మహిళల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని వంగలపూడి అనిత పేర్కొన్నారు. మహిళలు నిత్యం భయభ్రాంతుల మధ్య బ్రతకాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని అనిత విమర్శించారు. ఎన్నికలకు ముందు మద్యపాన నిషేధం అమలు చేస్తానని మహిళలకు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత దశల వారీ మద్య నిషేధం అని అమలు చేస్తామని చెప్పి రాష్ట్రంలో మద్యం వరదలై పారిస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో నాటుసారా ఎక్కువై ప్రజలు ప్రాణాలు పోగొట్టుకోవడమే కాకుండా, మద్యం వల్ల మహిళలపై నేరాలు కూడా పెరుగుతున్నాయని వంగలపూడి అనిత విమర్శించారు.