క్యారెక్టర్ లేని వెధవలు దుర్భాషలాడితే చూస్తూ ఊరుకోవాలా?వారికి బడితె పూజ తప్పదు: అనిత వార్నింగ్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మహిళలకు అడుగడుగునా అవమానాలు జరుగుతున్నాయని వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత మహిళలను అవమానిస్తూ వైసీపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తుంటే ఆ అరాచకాన్ని ప్రశ్నించినందుకు మహిళలపై పోలీసులు వేధింపులకు దిగారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కంచే చేను మేసిన చందంగా రాష్ట్రంలో పరిస్థితి మారిపోయిందని వంగలపూడి అనిత విమర్శలు గుప్పించారు. ఆడబిడ్డలను రక్షించాల్సిన పోలీసులే భక్షించినట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ఇది సైకో ప్రభుత్వం .. అందుకే మహిళలపైన ఇలా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిపై క్యారెక్టర్ లేని వెధవలు దుర్భాషలాడితే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు వంగలపూడి అనిత. ప్రశ్నించిన అనంతపురంలో టిడిపి మహిళా నేతలపై పోలీసులతో దాడులు చేయించారని వాళ్లను భయభ్రాంతులకు గురి చేశారని, వాళ్ళ వ్యాపారాలను దెబ్బకొట్టి వారిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పనులు చేయడానికి సిగ్గు లేదా అంటూ మండిపడ్డారు. ప్రభుత్వం తప్పులను ప్రశ్నిస్తున్న మహిళలను పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకుని దాడులు చేయించడం, కేసులు పెట్టించటం చూస్తుంటే ఇది సైకో ప్రభుత్వమని అర్థమవుతుందని వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళలు బాత్రూం లో గొడ్డలితో ఎవరినైనా చంపారా.. ఎందుకీ పోలీసుల వేధింపులు
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ మహిళా నాయకులే కాకుండా, అన్ని పార్టీల నుండి భువనేశ్వరిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు అని, ప్రజలందరూ భువనేశ్వరికి మద్దతు తెలిపి వైసిపి సర్కారు తీరును వ్యతిరేకించారని వంగలపూడి అనిత పేర్కొన్నారు. అయినప్పటికీ జగన్ సర్కార్ ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ, నిరసన వ్యక్తం చేసిన వారిని ఇబ్బంది పెడుతూ నీచ రాజకీయాలు చేస్తుందని అసహనం వ్యక్తం చేశారు. ఏ తప్పు చేశారని మహిళలను ఇంతగా ఇబ్బంది పెడుతున్నారో చెప్పాలని అనిత డిమాండ్ చేశారు. వారేమైనా బాత్రూంలో గొడ్డలితో ఎవరినైనా చంపారా? రోడ్లపై ఎవరినైనా పొడిచారా? ఎక్కడైనా అఘాయిత్యానికి పాల్పడ్డారా? అంటూ అనిత తీవ్రస్థాయిలో వైసీపీ సర్కారుపై ధ్వజమెత్తారు.

మహిళలను అవమానిస్తూ వైసిపి కౌరవుల పైశాచిక ఆనందం
పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లు మహిళలను వేధిస్తున్నారంటూ వంగలపూడి అనిత మండిపడ్డారు. పోలీసు ఉన్నతాధికారులు కిందిస్థాయి అధికారులకు ఈ విధమైన ఆదేశాలు ఎందుకు ఇస్తున్నారంటూ అనిత ప్రశ్నించారు. మహిళలను అవమానిస్తూ వైసిపి కౌరవులు పైశాచిక ఆనందం పొందుతున్నారని వంగలపూడి అనిత ధ్వజమెత్తారు . మహిళల ఇళ్లలోకి వెళ్లి సోదాలు చేయడానికి పోలీసులకు సిగ్గులేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అరాచకాన్ని ప్రశ్నించే వారంతా ఉగ్రవాదుల మాదిరిగా కనిపిస్తారా అంటూ అనిత ప్రశ్నించారు.

వైసీపీ నేతలకు అనిత వార్నింగ్
చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై దిగజారి మాట్లాడిన నేతలకు అదనపు భద్రత కల్పిస్తున్నారని, మహిళలను అవమానించారని ప్రశ్నిస్తే మాత్రం దాడులకు దిగుతున్నారని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు బనాయిస్తున్నారు అంటూ మండిపడ్డారు. వైసిపి పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అంటూ వంగలపూడి అనిత తేల్చి చెప్పారు. ఇలాగే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా బడితె పూజ తప్పదని వంగలపూడి అనిత వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నాయకులు రెచ్చిపోయి చేస్తున్న వ్యాఖ్యలను ఆపకుంటే తగిన శాస్తి జరుగుతుందని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications