జగన్ పై వివిధ పార్టీల స్పందన:ఉంపుడుగత్తెలా; ఇద్దరూ కబాలీలే
ఎపికి ప్రత్యేక హోదా ఇస్తే బిజెపితో చేతులు కలుపుతామన్న వైసిపి అధినేత జగన్ వ్యాఖ్యలపై బిజెపి నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జగన్ ప్రకటనను ఎపి బిజెపి నేతలతో సహా వివిధ పార్టీల నేతలు ఒక్కొక్కరు ఒక్కోవిధంగా చీల్చి చెండాడారు.
Recommended Video

''నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు సిద్ధమైతే... బీజేపీతో చేతులు కలుపుతాం. ప్రధాని మోదీ అనుకుంటే ఒక్క నిమిషంలో ప్రత్యేక హోదా ఇవ్వగలరు. ఇది ఆయన చేతిలో పని. ఏపీలో కాంగ్రెస్, బీజేపీలకు ఎలాంటి బలం లేదు. మా ప్రధాన లక్ష్యం తెలుగుదేశం పార్టీయే. ప్రత్యేక హోదా ఇస్తే మాత్రం బీజేపీతో చేతులు కలిపేందుకు నేను సిద్ధమే'' అంటూ వైసీపీ నేత వైఎస్ జగన్ ఓ ఆంగ్ల వార్తా చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొనడంపై బిజెపి నేతలతో సహా వివిధ పార్టీల నేతలు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ''కమలంతో పొత్తుకు సై'' అన్న జగన్ ప్రకటనపై ఏఏ పార్టీల నేతలు ఏమన్నారంటే

ప్రత్యేక హోదా...ముగిసిన అంశం:సోము వీర్రాజు
బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా అనేది ముగిసిన అంశం మని మరోసారి తెగేసి చెప్పారు. ఆ అంశంపై రాజకీయాలు చేయాల్సిన అవసరం బీజేపీకి లేదని, హోదా అంశం పట్టుకుని పొత్తులు పెట్టుకునే పరిస్థితిలో బీజేపీ లేదని అన్నారు. తాము ప్రస్తుతం టీడీపీతో ఉన్నామని...ఇతరులతో పొత్తు గురించి తమ పార్టీ ఆలోచించదని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా అధ్యాయం ముగిసిపోయింది. దాని బదులు ప్యాకేజీ వచ్చింది. ఇప్పటికే కేంద్రం 4వేల కోట్లు ఇచ్చింది. మరో 16 వేల కోట్లు రాబట్టేందుకు కేంద్రంతో చర్చలు జరుపుతామని సోము వీర్రాజు చెప్పారు.

ఎవరిచ్చినా...స్వాగతిస్తాం:మంత్రి మాణిక్యాలరావు...
జగన్ వ్యాఖ్యలపై బీజేపీ ఏపీ మంత్రి మాణిక్యాలరావు స్పందిస్తూ,ఎన్డీయేకు ఎవరు మద్దతు ఇచ్చినా స్వాగతిస్తామని, అయితే వేరే పార్టీల గురించి ఆలోచించాల్సిన అవసరం తమకు లేదని, అయినప్పటికీ తమకు మద్దతు ఇస్తామంటే స్వాగతిస్తామని స్పష్టం చేశారు.ఎన్డీయే కూటమి కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ చక్కగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోందని అన్నారు.

మళ్లీ కొత్తగా ఏంటిది:బీజేపీ మంత్రి కామినేని శ్రీనివాస్
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి బేషరతుగా మద్దతు ప్రకటించిన జగన్...మళ్లీ కొత్తగా మద్దతిస్తాననడం స్వార్థ రాజకీయాలకు పరాకాష్ట అని బీజేపీ మంత్రి కామినేని శ్రీనివాస్ విమర్శించారు.నీతి నిజాయితీలకు మారుపేరైన ప్రధాని మోదీ సరసన జగన్ను చూడలేమని కామినేని శ్రీనివాస్ అన్నారు. అవినీతికి, అరాచకానికి నిలయమైన జగన్తో పొత్తు వ్యక్తిగతంగా తనకు ఇష్టం లేదని తెలిపారు.

ముందు...రాజీనామా:మంత్రి అచ్చెన్నాయుడు
ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీకి మద్దతిస్తానని జగన్ అనడం హాస్యాస్పదమని మంత్రి అచ్చన్నాయుడు విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం తన ఎంపీలతో రాజీనామా చేయిస్తామని చెప్పి జగన్ మాట తప్పారు. ముందు వైసీపీ ఎంపీలతో రాజీనామా చేయించి అప్పుడు మాట్లాడాలని మంత్రి అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

ఉంపుడుగత్తెలా...జగన్: సీపీఐ రామకృష్ణ
ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో కలుస్తానని కేసుల భయంతోనే జగన్ చెబుతున్నారని విమర్శించారు. అధికారంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ అడిగితేనే ఇవ్వని ప్రత్యేక హోదాను...కేవలం కలిసి సాగుతామని జగన్ అనగానే ఎందుకు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. మోదీకి చంద్రబాబు ఇప్పటికే భార్యలా ఉన్నారని...ఇప్పుడు జగన్ ఉంపుడుగత్తెగా ఉండేందుకు ఉబలాటపడుతున్నాడని రామకృష్ణ ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో కలుస్తానని ప్రకటించి జగన్ రాజకీయ వ్యభిచారానికి దిగారు...కేసుల నుంచి బయటపడేందుకే జగన్ ఈ ప్రకటనలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు.

బాబు,జగన్...ఇద్దరూ కబాలీలే:తులసిరెడ్డి
మోదీ చేతిలో బాబు, జగన్ కీలుబొమ్మలని పీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్.తులసిరెడ్డి ఆరోపించారు.వారిద్దరూ ఆయనకు కబాలీలని..ఆయన ముందు చేతులు కట్టుకుని నిలబడే అనుచరులుగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. జగన్ భాషలో లౌక్యం అంటే లొంగిపోవడం...దౌత్యమంటే దాసోహమనడం.. పోరాడడం అంటే పారిపోవడమని ఎద్దేవాచేశారు.

అనుభవం ఉండాలి...సిఎం కాలేరు:చింతా మోహన్
జగన్ సీఎం కావాలంటే వయసుతో పాటు అనుభవమూ అవసరమని మాజీ ఎంపి చింతా మోహన్ అన్నారు. పాదయాత్రతో జగన్ ఎప్పటికీ సీఎం కాలేరని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications