జగన్ జైలుకెళ్తే ఏం చేయాలో చర్చించారు: వర్ల, బెజవాడలో భారీగా అద్దెలు
విజయవాడ: బెజవాడలో నిర్వహించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశం పైన టిడిపి నేత వర్ల రామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సమావేశం చంచల్ గూడ జైలులో ఖైదీల భేటీలా ఉందని, జైలులో ప్రవర్తించాల్సిన తీరుపై మాట్లాడుకున్నట్లుగా ఉందన్నారు. జగన్ జైలుకెళ్తే ఏం చేయాలనే దానిపై చర్చించారని ఎద్దేవా చేశారు.
మంగళవారం నాడు విజయవాడలో వైసిపి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిపై వర్ల విమర్శలు గుప్పించారు. చంచల్గూడ జైలులో నెలవారీ ఖైదీల సమావేశంలా జరిగిందని, ఒక రాజకీయ పార్టీ సమావేశంలా లేదన్నారు.
జైలులో ప్రవర్తించాల్సిన తీరుపై ముద్దాయిలు మాట్లాడుకుంటారని, వైసిపి సమావేశం కూడా అలాగే ఉందన్నారు. ఇక్కడ కూడా అధ్యక్షత వహించింది 11 కేసుల్లో ఎ1గా ఉన్న నిందితుడు జగన్ అని ఎద్దేవా చేశారు. ఆ పక్కన ఎ2, ఎ3, ఎ4 ఇలా మిగిలిన నిందితులంతా కూర్చున్నారన్నారన్నారు.
హాజరైన వారిలో నేరచరిత్ర కలిగి ఉన్న వారు ఎక్కువగా ఉన్నారన్నారు. 11 కేసుల్లో దర్యాప్తు చివరస్థాయికి వచ్చిందని, పటిష్టమైన సాక్ష్యాధారాలు సీబీఐ ప్రవేశపెట్టిన నేపథ్యంలో వీరంతా జైలుకు వెళ్లటం ఖాయమన్నారు. జగన్ జైలుకు వెళ్తే ఏం చేయాలో ఈ సమావేశంలో చర్చించినట్లు కనిపిస్తోందన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై చర్చ జరగాలి లేదా ప్రభుత్వ పని తీరుపై చర్చించాలని, ఇవేమీ లేకుండా మీరు చర్చించిదేమిటని ప్రశ్నించారు.ప్రభుత్వంపై విమర్శలు మాని నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని హితవు పలికారు.
ఉద్యోగుల రాకతో బెజవాడలో పెరుగుతున్న అద్దెలు
హైదరాబాద్ నుంచి ఉద్యోగులు బెజవాడకు తరలి వస్తుండడంతో నగరంలో అద్దెలు పెరుగుతున్నాయి. ఇప్పటికే సీఎం క్యాంపు కార్యాలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో అద్దెలు భారీగా పెరిగాయి. క్యాంపు కార్యాలయం నుంచి ఒకటి రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న సూర్యారావుపేట, మొగల్రాజపురం వంటి ప్రాంతాలలో ఫ్లాట్ల అద్దెలు భారీగా పెరిగాయి.
బెజవాడలో జగన్ 'తొలి' రాజకీయం, షాక్: సొంత జిల్లా ఎమ్మెల్యే డుమ్మా
మూడు బెడ్ రూంల ఇల్లు అయితే రూ.30 వేల వరకు ఉంది. క్యాంప్ ఆఫీసు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే గాంధీనగరం, గవర్నర్పేట, సూర్యారావుపేట, సత్యనారాయణపురాల్లో అద్దెలు 30 నుంచి 40 శాతం పెరిగాయి.
విద్యాసంస్థలతో పిల్లల చదువులకు అనువుగా ఉండే పటమటలంకలో మూడు బెడ్ రూంల ప్లాట్ రూ.20 వేల నుంచి 25 వేల దాకా ఉందంటున్నారు. అక్కడ ఏడాది క్రితం వరకూ కూడా ఇది రూ.15 వేల వరకు ఉండేది. దాదాపు ప్రతిచోట అద్దెలు దాదాపు ముప్పై నుంచి నలభై శాతం మేర పెరిగాయి.
నగర నడిబొడ్డు ప్రాంతాల్లో అద్దెలు భారీగా పెరగడంతో ఆ ప్రభావం రూరల్ ప్రాంతాలపై కూడా పడుతోంది. కాగా, బెజవాడలో ఇంటి అద్దె పెంపు పైన ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు స్పందించారు. అయినప్పటికీ అద్దెలు బారీగానే పెరుగుతున్నాయి.