‘మోడీ-బాబు జోడీని ఎవరూ విడదీయలేరు’
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎవరూ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలను విడదీయలేరని వర్ల రామయ్య అభిప్రాయపడ్డారు.
విజయవాడలోని టిడిపి కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో వర్ల మాట్లాడారు. కలిసి, మెలిసి రాష్ట్ర అభివృద్ధికి కష్టపడి పనిచేస్తున్న తెలుగుదేశం, బీజేపీతో విడిపోవాలని, విడాకులు ఇవ్వాలని వైయస్సార్ కాంగ్రెస్ కోరుకోవటం అనాగరిక ఆలోచనకు పరాకాష్టగా ఉందన్నారు.
ఏ వ్యక్తిగాని, పార్టీ గాని సంసారం చేసుకుంటున్న జంటను విడదీయాలని చూడరన్నారు. కానీ వైయఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ నీచ సంస్కృతికి కూడా తెరతీసిందన్నారు. గతంలో బిజెపితో కలిసే ప్రసక్తే లేదని, మైనార్టీ ఓటు బ్యాంకు మాదేనని విర్రవీగిన వైయస్సార్ కాంగ్రెస్ ఈరోజు తిరోగమనానికి కారణమేంటని ధ్వజమెత్తారు.
ఎన్ని కాళ్లకు మొక్కినా, ఎన్ని పొర్లుదండాలు పెట్టినా జగన్మోహన్రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి జగన్ మద్దతు పలకడం, ఇటీల లక్ష్మీపార్వతి.. ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన నేపథ్యంలో వర్ల ఆరోపణలు చేయడం గమనార్హం.