ఉంటే ఎంత? పోతే ఎంత?: రావెలపై వర్ల రామయ్య సంచలనం
అమరావతి: మాజీ మంత్రి రావెల కిషోర్బాబుపై ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కించపరిచే విధంగా మాట్లాడితే పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
రావెలకు హెచ్చరిక
రావెల పదవిలో ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు ఒకలా మటాడుతున్నారని వర్ల విమర్శించారు. రావెల రాజీనామా చేస్తే చేసుకోవచ్చని, అది ఆయన వ్యక్తిగతమని రామయ్య వ్యాఖ్యానించారు. టీడీపీలో అందరూ క్రమశిక్షణ పాటించాల్సిందేనని, క్రమశిక్షణ తప్పితే పార్టీలో చర్యలు తీసుకుంటామని మరోసారి హెచ్చరించారు.
టీడీపీ కట్టుబడి ఉంది..
ఎస్సీ వర్గీకరణపై టీడీపీకి ఓ సిద్ధాంతం ఉందని, దానికి అనుగుణంగానే అందరూ వ్యవహరించాలని సూచించారు. వర్గీకరణ అంశం కేంద్రం పరిధిలో ఉన్న అంశమని, అయినా చంద్రబాబు దానికోసం కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
మందకృష్ణ అడుపెట్టొద్దన్నలేదు..
ఎమ్మార్పీఎస్ నాయకుడు మందకృష్ణమాదిగ రాష్ట్రంలో అడుగు పెట్టొద్దని తాము ఎప్పుడు అనలేదని చెప్పారు. అక్టోబర్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఇళ్ల సామూహిక గృహప్రవేశ కార్యక్రమం చేపడుతామని తెలిపారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని రామయ్య పేర్కొన్నారు.
కిశోర్ బాబు అసంతృప్తి..
ఎస్సీ వర్గీకరణ కోసం అవసరమైతే తన ఎమ్మెల్యే పదవిని సైతం వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని గుంటూరు జిల్లా పత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు అన్నారు. వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అడుగుజాడల్లో నడుస్తానని, ఆయన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానని, వర్గీకరణ కన్నా పదవులు ముఖ్యం కాదని ఈ సందర్భంగా ఆయన అన్నారు.అంతేగాక, గుర్రం జాషువా తండ్రి యాదవ, తల్లి మాదిగ కులస్తురాలని, మాదిగల మాదిరి యాదవులు స్పందించడం లేదని వ్యాఖ్యానించారు.