వైఎస్ వివేకా హత్య కేసు : జగన్పై వర్ల రామయ్య సంచలన ఆరోపణలు
వైఎస్ వివేకానంద హత్య కేసుపై టీడీపీ సీనియర్ నేత,ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఘాటుగా స్పందించారు. హైకోర్టులో ఎందుకు రిట్పిటిషన్ వేశానా... ముఖ్యమంత్రితో ఎందుకు పెట్టుకున్నానా...అని వైఎస్ వికేకా కుమార్తె సునీత భయపడేలా ఆమె సోదరుడైన జగన్మోహన్రెడ్డి వ్యవహరిస్తున్నాడని వర్ల రామయ్య విమర్శించారు. వివేకాహత్యకేసు విచారణపై, చెల్లెలు పిటిషన్వేసినా సీబీఐ విచారణపై జగన్మోహన్రెడ్డి ఎందుకు స్పందించడంలేదని, ఎందుకు తాత్సారం చేస్తున్నారని వర్ల ప్రశ్నించారు. తన అన్నపై నమ్మకంలేకనే సునీత కోర్టుని ఆశ్రయించిందని, జగన్ ఎవరిని కాపాడటానికి సీబీఐ ప్రకటనపై వెనకడుగువేస్తున్నాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ తక్షణం కేసును సీబీఐకి అప్పగించకుంటే, హత్యకేసు ముద్దాయిలను ఆయనే కాపాడాలని చూస్తున్నాడని భావించాల్సి వస్తుందన్నారు.

సునీతపై జగన్ కక్ష పెంచుకున్నారా?
వివేకా హత్య కేసులో జగన్ను ఇంప్లీడ్చేస్తూ చెల్లెలు సునీత కోర్టుకి వెళ్లడంతో.. ఆమెపై జగన్ కక్షపెంచుకున్నాడేమోననే అనుమానం కలుగుతోందన్నారు వర్ల. అర్థాంతరంగా హైదరాబాద్లోని సునీత ఇంటి చుట్టూ భారీ సంఖ్యలో పోలీసుల్ని మోహరించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. తన పేరుని సునీత బద్నాం చేసిందని, తనను అవమానించిందనే జగన్ పోలీసులను పంపించాడా ప్రశ్నించారు. ముఖ్యమంత్రితో ఎందుకు పెట్టుకున్నానా అని భయపడేలా చేసి.. పిటిషన్ను సునీత ఉపసంహరించుకునేలా చేయాలన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లున్నాడని ఆరోపించారు. ఆమె ఇంటి చుట్టూ మోహరించిన పోలీసులు తెలంగాణ వారా...? లేక ఆంధ్రావారా? అని నిలదీశారు. తనకు ఎదురొస్తే, చెల్లెలైనా, మరొకరైనా వదలననే సంకేతాన్ని ప్రజలకు ఇవ్వాలని జగన్ ఆలోచిస్తున్నట్టుగా ఉందన్నారు. ఇప్పటికైనా జగన్ వివేకా హత్యకేసుని సీబీఐకి అప్పగిస్తున్నట్లు తక్షణమే ప్రకటన చేయాలన్నారు.

బాలకృష్ణపై దాడి వైసీపీ పనే..
దేశంలో ఏ రాష్ట్రంలో ఉద్యమాలు, ఆందోళనలు జరిగినా అక్కడున్న ప్రభుత్వాలు కౌంటర్ ఉద్యమాలు ప్రారంభించలేదని, కానీ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం మాత్రం ఈ దిశగా ఆలోచన చేయడం దుర్మార్గమని వర్ల మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా అమరావతి ఉద్యమం జరుగుతుంటే, పదీ, ఇరవై మందితో జగన్ ప్రభుత్వం కౌంటర్ ఉద్యమాలు నడుపుతూ, ప్రజలమధ్యన చిచ్చుపెట్టాలని చూస్తోందన్నారు. వర్గాలుగా, బృందాలుగా విడిపోయి ప్రజలు తన్నుకు చస్తుంటే, ముఖ్యమంత్రి, అధికారయంత్రాంగం చోద్యం చూస్తోందన్నారు. హిందూపురంలో టీడీపీనేత నందమూరి బాలకృష్ణ పర్యటనను అడ్డుకొని, ఆయన్ని నిర్బంధించింది ముమ్మాటికీ వైసీపీ కిరాయిమనుషులేనని ఆరోపించారు. మూడురాజధానుల ముసుగులో బాలయ్యపై వ్యవహరించిన తీరుని తెలుగుదేశంపార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.

ఆర్టికల్ 19 ఉల్లంఘన..
రాజ్యాంగంలోని ఆర్టికల్-19ని రాష్ట్రంలో అమలుచేయకుండా, అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్ఛని ప్రజలకి ఇవ్వకుండా, వైసీపీ సర్కారు నిత్యం 144 సెక్షన్ అమలుచేస్తోందన్నారు. రాజధాని తరలించడానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం, ప్రజల సందేహాలను ఎందుకు నివృతి చేయడం లేదన్నారు. ప్రజల్లో భయాందోళనలు తొలగించకుండా, ఉద్యమాలు చేస్తున్నవారిని అణచివేయడానికి కృత్రిమ ఉద్యమాలు సృష్టించడం అన్యాయం అన్నారు. దివంగత వై.ఎస్ హయాంలో అమరావతి కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులందరూ కాలచక్ర మహాసభలు నిర్వహించారని, అటువంటి అమరావతిని తరలించడానికి జగన్ ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు.

జగన్ నియంత పాలన..
నియంతపాలనకు, జగన్ పాలనకు తేడా లేదని, ఇదే పద్ధతిని కొనసాగిస్తే.. రాబోయే రోజుల్లో జరగబోయే విపత్కర పరిణామాలకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాల్సి ఉంటుందని వర్ల హెచ్చరించారు. అధికారుల్ని తనతో పాటు జైలుకి తీసుకెళ్లడం జగన్కు అలవాటుగా మారిందని విమర్శించారు. ఈ విషయాన్ని ఏపీ అధికార యంత్రాంగం ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిదని వర్ల హితవు పలికారు. జగన్ కారణంగా శ్రీలక్ష్మి, ఆచార్య, రాజగోపాల్, బ్రహ్మనందరెడ్డి, రత్నప్రభలు అనుభవిస్తున్న వేదనను అధికార యంత్రాంగం గుర్తించాలన్నారు. రాష్ట్రంలోని సమస్యలన్నీ జగన్ సృష్టించినవేనని, కుటుంబ బంధాలు, మానవతా విలువలు, సున్నిత హృదయం లేనివ్యక్తి పరిపాలన ఎలా ఉంటుందో రాష్ట్రమంతా చవిచూస్తోందన్నారు. చట్టం అందరికీ సమానమేనని, పోలీసులు, ఇతర అధికారులు పక్షపాతంలేకుండా విధులు నిర్వహించా లని రామయ్య విజ్ఞప్తిచేశారు.












Click it and Unblock the Notifications