'ఆమె'కు కీలక బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు
వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మెజారిటీ సీట్లను టీడీపీ కైవసం చేసుకోవాలని పార్టీ నేతలకు చంద్రబాబు లక్ష్యాన్ని నిర్దేశించారు.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ ఛార్జ్గా వరుపుల సత్యప్రభను నియమించారు. ఆమె ఇటీవలే మృతిచెందిన పార్టీ నేత వరుపుల రాజా సతీమణి. చంద్రబాబునాయుడి ఆదేశాల ప్రకారం సత్యప్రభను ఇన్ ఛార్జిగా నియమించాలని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. మరణించడానికి ముందు రాజా ప్రత్తిపాడు నియోజకవర్గానికి ఇన్ ఛార్జిగా ఉన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు డీసీసీబీ చైర్మన్ గా రాజా పనిచేశారు. పార్టీ అధినేత చంద్రబాబు రాజా మరణించినప్పుడు కుటుంబాన్ని పరామర్శించడమే కాకుండా స్వయంగా రాజా పాడె మోశారు. ఈనెల నాలుగోతేదీన గుండెపోటుతో రాజా కన్నుమూసిన సంగతి తెలిసిందే.
రాజా తర్వాత ప్రత్తిపాడు నియోజకవర్గానికి పార్టీ తరఫున ఇన్ ఛార్జిగా ఎవరుంటారనే విషయంపై పార్టీలో చర్చ జరిగింది. వరుపుల రాజా సంస్మరణ సభలో కూడా ఇదే విషయం ప్రస్తావనకు వచ్చింది. చంద్రబాబు చివరకు సత్యప్రభకు అప్పగిస్తూ ఈరోజు ఆదేశాలు జారీచేశారు. 2019 ఎన్నికల్లో రాజా ప్రత్తిపాడు నుంచి స్వల్ప మెజారిటీతో ఓటమిపాలయ్యారు. ఎన్నికలైన కొద్దిరోజుల తర్వాత పార్టీకి రాజానామా చేశారు. తర్వాత నాయకుల బుజ్జగింపుతో మళ్లీ పార్టీలోకి వచ్చారు. వెంటనే ప్రత్తిపాడు ఇన్ ఛార్జిగా కొనసాగుతున్న సమయంలోనే హఠాన్మరణం పాలయ్యారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిల్లో అత్యధిక స్థానాలను వచ్చే ఎన్నికల్లో కైవసం చేసుకోవాలని పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. కాపు సామాజికవర్గ ప్రభావం జిల్లాలో ఎక్కువగా ఉండటం, కన్నా లక్ష్మీ నారాయణ లాంటి నాయకుడు పార్టీలోకి రావడంతోపాటు రానున్న ఎన్నికల్లో జనసేనతో పొత్తుంటుందని భావిస్తున్న తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలను టీడీపీ గెలుచుకుంది. దీంతో జిల్లాలోని తెలుగు తమ్ముళ్ల లో జోష్ నెలకొంది. జనసేనతో పొత్తు పార్టీకి కలిసివస్తుందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉంటుందనే అభిప్రాయాన్ని ఇరు పార్టీల నాయకులు వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications