సజ్జలతో వసంత కృష్ణప్రసాద్ భేటీ-తండ్రి కామెంట్స్ పై వివరణ-మైలవరం సీటుపైనా చర్చ !
ఏపీ మాజీ హోంమంత్రి, వైసీపీ నేత వసంత నాగేశ్వరరావు.. సొంత ప్రభుత్వంలో కమ్మ సామాజిక వర్గానికి, అమరావతి రాజధానికి జరుగుతున్న అన్యాయంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఆయన కుమారుడు వసంత కృష్ణప్రసాద్ మైలవరం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కూడా. ఈ నేపథ్యంలో కృష్ణప్రసాద్ ఇరుకునపడ్డారు. చివరికి అధిష్టానం నుంచి ఫోన్లు రావడంతో నిన్న సాయంత్రం తన తండ్రి వ్యాఖ్యలకూ తనకూ ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పేశారు.
ఈ నేపథ్యంలో అధిష్టానం నుంచి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు పిలుపువచ్చింది. దీంతో ఆయన ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డికి వివరణ ఇచ్చారు. తన తండ్రి వ్యాఖ్యలతో తనకు ఎలాంటిసంబంధం లేదని, తాను జగన్ తోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. అలాగే మైలవరం నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ జోక్యంతో పాటు పలు అంశాలపై ఆయన సజ్జల రామకృష్ణారెడ్డితో చర్చించినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి వైఎస్ జగన్ సీఎం కాకముందు నుంచే ఆయనతో వసంత కృష్ణప్రసాద్ కు వ్యాపార సంబంధాలు ఉన్నాయి. జగన్ అక్రమాస్తుల కేసుల్లోనూ ఆయన పేరు ప్రస్తావనకు వచ్చింది. జగన్ అధికారంలోకి రాగానే ఆయన మంత్రి పదవి వస్తుందని ఆశించినా దక్కలేదు. రెండోసారి కేబినెట్లో కొడాలి నాని స్ధానంలో తనకు మంత్రి పదవి ఇస్తారని కృష్ణప్రసాద్ గంపెడాశలు పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో వసంత తన తండ్రి నాగేశ్వరరావుతో కలిసి పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. దీన్ని ఆయన ఖండించారు. అదే సమయంలో తండ్రి కమ్మ సామాజిక వర్గానికి వైసీపీ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతోందంటూ చేసిన వ్యాఖ్యలు వసంతను చిక్కుల్లో పడేశాయి. అదే సమయంలో మంత్రి జోగి రమేష్ పెడన వదిలి మైలవరంలో పోటీ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు వసంతను చికాకుపెడుతున్నాయి.












Click it and Unblock the Notifications