నిప్పా..! తుప్పా..! దమ్ముంటే విచారణ ఎదుర్కోవాలి : బాబుకు పద్మ సవాల్
విజయవాడ : ఓటుకు నోటుకు విచారణను నిలిపేయాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించడం పట్ల తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు వైసీపీ నేతలు. తాజాగా దీనిపై స్పందించిన పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ చంద్రబాబును కడిగిపారేశారు. దమ్ముంటే విచారణను ఎదుర్కోవాలని చంద్రబాబును సవాల్ చేసిన పద్మ.. చంద్రబాబు నిప్పు కాదని ఆయన ఒళ్లంతా వట్టి తుప్పేనని ఎద్దేవా చేశారు.
ఓటుకు నోటు ఆడియో టేపుల్లో మావాళ్లు బ్రీఫుడు మీ అన్న గొంతు చంద్రబాబుదే అన్నది సుస్పష్టమని, ఫోరెన్సిక్ పరీక్షల్లోను అదే తేలిందని చెప్పారు వాసిరెడ్డి పద్మ. అందుకే.. చంద్రబాబు కూడా ఆ గొంతు తనది కాదని చెప్పే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదన్నారు పద్మ. దమ్ముంటే విచారణను ఎదుర్కోవాలి గానీ.. ఇలా దొడ్డిదారిన తప్పించుకోవాలని చూడడం సరికాదన్నారు.
చట్టానికి దొరక్కుండా తప్పించుకోవాలని చూస్తోన్న చంద్రబాబు.. ప్రజల ముందు ఎన్నడో దోషిగా నిలబడ్డారని పేర్కొన్నారు. చంద్రబాబు స్వయంగా మాట్లాడిన మాటలు.. బయటపడ్డాక కూడా ఆయన తప్పించుకునే ప్రయత్నం చేయాలని చూడడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అన్నారు. ఇక సోమిరెడ్డి లాంటి టీడీపీ నేతలు.. కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చలేమని మాత్రమే చెబుతున్నారు గానీ చంద్రబాబు ముద్దాయి కాదని మాత్రం ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు పద్మ.
ఇప్పటికైనా చంద్రబాబు విచారణను ఎదుర్కోవాలని సవాల్ చేశారు పద్మ. ఇంతకుముందు కూడా పలు కేసుల విషయంలో కోర్టులకెళ్లి స్టే తెచ్చుకున్న చంద్రబాబు.. ఒక్క విచారణను కూడా ప్రత్యక్షంగా ఎదుర్కోలేకపోయారని గుర్తు చేశారు.