'చట్టాన్ని అతిక్రమించే టీడీపీ నేతలకు చంద్రబాబు అండదండలు'
అమరావతి: ఏపీలో చట్టాన్ని అతిక్రమించే టీడీపీ నేతలను సీఎం చంద్రబాబు కాపాడుతున్నారని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. గురువారం ఆమె వైసీపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూములను టీడీపీకి చెందిన నేతలు లాక్కుంటున్నారని ఆమె ఆరోపించారు.

రాజధాని ప్రాంతంలో భూములను లాక్కున్నట్లే, రాబోయే రోజుల్లో రాష్ట్రమంతటా భూములను లాక్కుంటారని ఆమె తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 18 నెలల్లో అసైన్డ్ భూములు ఎవరెవరి చేతులు మారాయో బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు.
జన్మభూమి సభలను రద్దు చేయాలి: వామపక్షాలు
ప్రజల సమస్యలను పరిష్కరించలేని జన్మభూమి సభలను రద్దు చేయాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం తిరుపతిలో పెద్ద ర్యాలీని నిర్వహించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మభూమి సభ జరిగే నెహ్రూ మునిసిపల్ స్కూల్ మైదానానికి కార్యకర్తలు ర్యాలీగా బయల్దేరారు. అయితే వారిని భవానీ సర్కిల్ సమీపంలో పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.
అవినీతిమయంగా చంద్రన్న సంక్రాంతి కానుక..!
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన చంద్రన్న సంక్రాంతి కానుక అవినీతి మయమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 400 నమూనాలను పరిశీలించిన అధికారులు భారీ స్థాయిలో అవినీతి జరిగినట్లు నిర్థారించారు. నాసికరం సరుకులు, తూకంలో మోసాలకు పాల్పడుతున్న వారిని గుర్తించిన అధికారులు కేసులు నమోదు చేశారు.
ఇలా తొమ్మిది జిల్లాల్లో సుమారు 40కు పైగా కేసులు నమోదు చేశారు. పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునిత సొంత జిల్లా అనంతపురంతో సహా కృష్ణ, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర, ప్రకాశం, నెల్లూరులలో అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.
ముఖ్యంగా చంద్రన్న సంక్రాంతి కానుకలో భాగంగా ఇచ్చిన కందిపప్పు, గోదుమపిండి, శేనగపప్పు, నెయ్యిలో నాణ్యత మరీ నాసి రకంగా ఉన్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది.












Click it and Unblock the Notifications