బాబూ! మీ ఫ్యామిలీ సంగతేమిటి, ప్రత్యేక దేశమా?: వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన నవనిర్మాణ దీక్షపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు వాసిరెడ్డి ధ్వజమెత్తారు. నవనిర్మాణ దీక్ష పేరుతో చంద్రబాబు పదేపదే తాను చేసిన మోసాన్ని గుర్తు చేస్తున్నారని ఆమె గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
ప్రతిజ్ఞను దేశ పౌరులుగా చేయించాలి గానీ రాష్ట్ర పౌరులుగా కాదని ఆమె అన్నారు. నవనిర్మాణ దీక్షకు సంబంధించిన జీవోపై రాజద్రోహం కేసు పెట్టవచ్చునని ఆమె అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఏమైన ప్రత్యేక దేశమా అని ఆమె ప్రశ్నించారు. చేతులెత్తించి ప్రతిజ్ఞ చేయించినంత మాత్రాన మనమేమైనా ముందుకు వెళ్తున్నట్లా అని ఆమె అడిగారు.
చేసిన ప్రతిజ్ఞలో కూడా జై జన్మభూమి అంటూ రాజకీయాలే చేశారని ఆమె ఎత్తిపొడిచారు. ఇంతకు చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రతిజ్ఞ చేశారా అని ఆమె అడిగారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ను గోబెల్స్ భవన్గా మార్చుకోవాలని ఆమె వ్యంగ్యంగా అన్నారు. దివాకోరు ముఖ్యమంత్రిగా మాట్లాడకుండా చిత్తశుద్ధితో పనిచేయాలని లేకుంటే చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారని అన్నారు.
చంద్రబాబు చేసింది నవనిర్మాణ దీక్ష కాదని, అది విధ్వంస దీక్ష కాదని అని ఆమె అన్నారు. కాంగ్రెసు, బిజెపిలు రెండు కూడా రాష్ట్రానికి అన్యాయమే చేశాయని అన్నారు. విభజన కోసం వెంటపడి మరీ లేఖ ఇచ్చింది చంద్రబాబు కాదా, విభజన కోసం ఏర్పాటు చేసిన కమిటీలకు లేఖలు ఇవ్వలేదా అని పద్మ అడిగారు.
పార్లమెంటులో విభజనకు తొలి ఓటు వేసింది తెలుగుదేశం పార్టీ ఎంపీలు కాదా, వారి నోటితోనే ఆ నిజాన్ని చెప్పించలేదా అని అడిగారు. చంద్రబాబు 2022, 2029, 2050 గురించి మాట్లాడుతున్నారని అంటూ 2019 వరకు ఏమీ చేయరా అని వాసిరెడ్డి పద్మ అడిగారు.