నాడు చంద్రబాబు తగ్గించారు.. నేడు వైఎస్ జగన్ పెంచేశారు!
అమరావతి: రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ రేట్లకు రెక్కలొచ్చాయి. ఈ రెండింటి రేట్లను పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటిదాకా పెట్రోలు, డీజిల్పై వసూలు చేస్తోన్న విలువ ఆధారిత పన్ను (వ్యాట్) రేటును సవరించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి డాక్టర్ డీ సాంబశివరావు ఉత్తర్వులను జారీ చేసింది. తాజాగా పెంచిన రేట్ల ప్రకారం.. పెట్రోలు లీటర్ ఒక్కింటికి 70 పైసలు, డీజిల్ లీటర్ ఒక్కింటికి ఒక రూపాయి అదనపు భారం పడుతుంది.
ఇదివరకు రాష్ట్రంలో ఒక లీటర్ పెట్రోలు అమ్మకంపై 31 శాతం వ్యాట్ను వసూలు చేస్తుండేది ప్రభుత్వం. తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఈ సంఖ్యను 35.20 శాతానికిపెంచారు. ఇక డీజిల్పై ఇదివరకు 22.25 శాతం వ్యాట్ను వసూలు చేస్తుండగా.. దాన్ని 27 శాతానికి పెంచారు. తాజాగా సవరించిన ఈ పన్ను రేట్ల వల్ల రాష్ట్ర ఖజానాకు సంవత్సరానికి 650 కోట్ల రూపాయల అదనపు ఆదాయం అందుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
నిజానికి- ఇదివరకు పెట్రోలు, డీజిల్ రేట్లను చంద్రబాబు నాయుడి ప్రభుత్వం తగ్గించింది. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల సమయంలో.. వాటి రేట్లను రెండు రూపాయల వరకు తగ్గించింది. ఆ సమయంలో పెట్రోలు, డీజిల్ రేట్లు 90 రూపాయల మార్క్ను దాటిపోయింది. కొన్ని రాష్ట్రాల్లో వంద రూపాయలను కూడా అందుకున్న సందర్భాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్రోలు, డీజిల్ రేట్లను తగ్గించారు.
అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల వ్యవధిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం.. ప్రజలపై వడ్డించిన రెండో నిర్ణయం ఇది. ఇదివరకు ఆర్టీసీ బస్సు ఛార్జీలను భారీగా పెంచారు. ఆ తరువాత ఇప్పుడు పెట్రోలు, డీజిల్ రేట్లను సవరించారు. దీనిపై తెలుగుదేశం పార్టీ నాయకులు భగ్గుమంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో పెట్రోలు, డీజిల్ రేట్లను తగ్గించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. మొన్న ఆర్టీసీ ఛార్జీలు, నేడు పెట్రోలు, డీజిల్ రేట్లు.. ఇలా అన్నింటి రేట్లను పెంచేస్తారని విమర్శిస్తున్నారు.