vegetable rates hike: మిర్చి కిలో రూ.60, ఇతర విజిటేబుల్స్ కూడా, ఎందుకంటే...?
దేశంలో లాక్డౌన్ 5.0 అమల్లోకి వచ్చింది. కంటైన్మెంట్ జోన్లలో తప్ప మిగతా చోట్ల ఆంక్షలను కేంద్రం తీసేసింది. అయితే ఇదివరకు తక్కువ ధరలో లభించిన కూరగాయాలు.. ఇప్పుడు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. కూరగాయాలు కొనాలంటేనే జంకే పరిస్థితి ఏర్పడింది. ఏ విజిటేబుల్ కొనాలన్న ఒక్కటికీ రెండుసార్లు ఆలోచిస్తున్నాడు.
జూన్ 30 వరకు తెలంగాణలో లాక్డౌన్: అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం ఎత్తివేత
మిర్చి కిలో రూ.60
వాస్తవానికి లాక్డౌన్ సమయంలో ఏ విజిటేబుల్ అయినా రూ.10 నుంచి రూ.20 లోపు లబించింది. కానీ ఇప్పుడు పచ్చి మిర్చి ధర రెట్టింపయ్యింది. ఒంగోలులో రూ.20 పలికిన మిర్చి.. ఇప్పుడు రూ.50 నుంచి రూ.60కి చేరింది. బీన్స్, కాకర, చామదుంప, బంగాళదుంప కిలో రూ.30 నుంచి రూ.50 నుంచి రూ.60కి చేరింది. లాక్ డౌన్ సమయంలో కూరగాయాలు విక్రయించేవారితోపాటు మిగతా వారు కూడా విజిటేబుల్స్ అమ్మేవారు. కానీ సడలింపులతో కూరగాయల మార్కెట్లు తెరుచుకుంటుండగా.. తోపుడు బండ్ల ద్వారా విక్రయించేవారు.. తమ వృత్తి పనులు చేసుకుంటున్నారు. గతంలో విక్రయించిన వారు.. కొద్ది మొత్తంలో కూరగాయాలు విక్రయించడం కూడా ధరలు పెరిగేందుకు కారణమైంది.
పెరిగిన ధరలు
ఇటు గుంటూరులో కూడా విజిటేబుల్స్ ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో విజిటేబుల్ ధర రెట్టింపు పలుకుతోంది. రాష్ట్రంలోని మిగతా చోట్ల.. పొరుగున గల తెలంగాణ రాష్ట్రంలో కూడా కూరగాయాల ధరలు ఎక్కువగా పలుకుతున్నాయి. అయితే వ్యాపారులు మాత్రం జూన్ సీజన్ అయినందున.. కూరగాయాలు డిమాండ్కు సరిపడ రావడం లేదు అని చెబుతున్నారు. కొద్దిరోజుల్లో కూరగాయాలు ఎక్కువగా వస్తాయని.. అప్పుడు సమస్య తీరుతుందని చెబుతున్నారు.
మార్కెట్లో వైరస్
గుంటూరులో హోల్ సేల్ మార్కెట్ బస్టాండ్ పక్కనే ఉండగా.. దానిని శివారు ఏటుకూరు బైపాస్ మార్కెట్కు తరలించారు. అంతేకాదు జనం రద్దీ దృష్ట్యా 26 మంది వ్యాపారులకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. మంగళవారం ఒక్కరోజే 18 మందికి వైరస్ సోకింది. దీంతో మార్కెట్ మూసివేసి.. వైరస్ నివారణ చర్యలు చేపట్టారు. ఈ మార్కెట్ వద్ద రిటైల్ వ్యాపారులు, వినియోగదారులు భారీగా వచ్చి కొనుగోలు చేసేవారు. అంతేకాదు ఇదీ కూడా కోయంబేడు మార్కెట్లా మారుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక్కడ 450 మంది వ్యాపారులు ఉన్నారు. వారికి పరీక్షలు చేయగా 26 మందికి పాజిటివ్ వచ్చింది.
తొలుత వ్యాపారికి..?
సిటీలో రెడ్ జోన్లో ఉంటూ మార్కెట్కు వచ్చే వ్యాపారికి తొలుత వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. అతని ద్వారా మిగతావారికి కూడా వ్యాధి వ్యాపించిందని భావిస్తున్నారు. మార్కెట్ను గుంటూరు కమిషనర్ అనూరాధ, డీఎస్పీ కమలాకర్ సందర్శించారు. వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో నివారణ చర్యలు తీసుకుంటామని.. తర్వాతే మార్కెట్ తెరుస్తామని అధికారులు స్పష్టంచేశారు.