చంద్రబాబు అవినీతిలో పవన్ కళ్యాణ్కూ వాటా: మంత్రి వెల్లంపల్లి సంచలన ఆరోపణలు
అమరావతి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ల దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు కమీషన్ల బాగోతాన్ని ఆదాయపుపన్ను శాఖ బట్టబయలు చేసిందని, దీంతో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ అవినీతిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోందని అన్నారు.
చంద్రబాబు దగ్గర లక్షకోట్లు..
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక మాజీ వ్యక్తిగత కార్యదర్శి దగ్గరే రూ. 2 వేల కోట్ల అవినీతి బయటపడిందంటే చంద్రబాబు దగ్గర లక్షల కోట్ల అవినీతి బయటపడుతుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు దోచుకున్న సొమ్మును కేంద్ర ప్రభుత్వం కక్కించాలని అన్నారు. చంద్రబాబు తన అవినీతి బయటపడుతుందనే చంద్రబాబు సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకున్నారని మంత్రి గుర్తు చేశారు.
చంద్రబాబు అవినీతిలో పవన్ కళ్యాణ్కు వాటా..
రూ. 2వేల కోట్ల అవినీతిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నంచారు. అంతేగాక, చంద్రబాబు అవినీతిలో పవన్ కళ్యాణ్కు కూడా భాగం ఉందని మంత్రి ఆరోపించారు. చంద్రబాబు అవినీతి వామపక్షాలకు కనిపించడం లేదా? అని నిలదీశారు.
పదేళ్ల బడ్జెట్కు సరిపోయే అవినీతి చేశారు..
బినామీల దగ్గర ఐటీ దాడులు జరిగితే పది సంవత్సరాల రాష్ట్ర బడ్జెట్కు సరిపడినంత డబ్బు దొరుకుతుందని మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యానించారు. చంద్రబాబు అవినీతిపై ఈడీ, సీబీఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. మరో వైసీపీ ఎంపీ మార్గాని భరత్ కూడా చంద్రబాబు లక్ష్యంగా చేసుకుని విమర్శలు ఎక్కుపెట్టారు.
చంద్రబాబు నోరుమెదపరెందుకు?
టీడీపీ కీలక నేతలపై ఐటీ దృష్టి సారిస్తే ఎన్ని లక్షల కోట్లు బయటపడతాయో అని అన్నారు. టీడీపీ నేతలు సంపాదించిన అక్రమ ఆదాయం ఇప్పుడు బయటికి వస్తోందన్నారు. నాలుగు చోట్ల సోదాలు చేస్తేనే వేల కోట్ల రూపాయలు బయటపడ్డాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఐటీ దాడులపై చంద్రబాబు ఇప్పటి వరకు ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. ఐటీ దాడులు ఇలాగే కొనసాగితే టీడీపీ అక్రమాలు మరిన్ని బయటపడే అవకాశం ఉందన్నారు. కాగా, గత కొద్ది రోజులుగా చంద్రబాబు పీఎస్ నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. సుమారు 2వేల కోట్లకుపైగా ఆస్తి గుర్తించినట్లు సమాచారం.