వెంకయ్యకు హీట్: ఏపీ టు జమ్మూకాశ్మీర్, బీజేపీలో రాంమాధవ్ 'కీ'!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కీలక నేత, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు రాష్ట్రంలో సొంత పార్టీ నుండి హీట్ ఎదుర్కొంటున్నారని అంటున్నారు. ఆరెస్సెస్ కీలక నేత రామ్ మాధవ్ ఇటీవల బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆయన పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు.
ఆయన చేరిక తర్వాతనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీలోకి చేరికలు పెరిగాయని అంటున్నారు. ప్రధానంగా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రామ్ మాధవ్ చేరిక, ఆయన సహకారంతో బీజేపీలోకి చేరికలు... ఇది వెంకయ్యకు కొద్దిగా ఇబ్బందికర పరిణామాలే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
రామ్ మాధవ్ ఆరెస్సెస్ నుండి వచ్చారు. ఇప్పుడు పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా టీంలో కీలక నేత. అంతేకాదు, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల సమయంలోను ఆయన కృషి చేశారు. జమ్మూ కాశ్మీర్లో బీజేపీ 25 సీట్లు గెలుచుకొని సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఈ చర్చల్లో కూడా కేంద్రమంత్రి అరుణ్ జైట్లీతో పాటు రామ్ మాధవ్ కూడా పాల్గొంటున్నారు. జైట్లీ, మాధవ్లు ఇరువురు కూడా జమ్మూ కాశ్మీర్ చర్చల కోసం వెళ్లారు.
కాంగ్రెస్ పార్టీ తుడిచి పెట్టుకుపోతున్న నేపథ్యంలో ఏపీలో పలువురు కాపు, రెడ్డి నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందులో చాలామంది రామ్ మాధవ్ ద్వారానే బీజేపీలో చేరడం బాగుంటుందని భావిస్తున్నారని తెలుస్తోంది.
ఇటీవల మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. రామ్ మాధవ్ మధ్యవర్తిత్వం నెరపడం వల్లే ఆయన బీజేపీలోకి వచ్చారని అంటున్నారు. అయితే, రామ్ మాధవ్ ద్వారా చేరినంత మాత్రాన వెంకయ్య నాయుడుకు వ్యతిరేకం కాదనే చెబుతున్నారు. కానీ, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్లో కీలకంగా ఉన్న వెంకయ్యకు ఇది అప్సెట్ చేసే అంశమే అంటున్నారు.