అసెంబ్లీలో లేనే లేరు, ప్రత్యేక హోదాపై మాట్లాడ్తారు: వెంకయ్య ఎద్దేవా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కమ్యూనిస్టులకు ప్రాతినిధ్యమే లేదని, ఏ హోదా లేనివారు ప్రత్యేక హోదా అడుగుతున్నారని కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు ఎద్దేవా చేశారు. దేశంలో కమ్యూనిస్టులకు మనుగడ లేదని ఆయన అన్నారు. సంఘర్షణతో కాదు సంయమనంతో ఆదరణ పెరుగుతుందని ఆయన అన్నారు.
మీడియాలో కనపడడం కోసమే కమ్యూనిస్టులు తహతహలాడుతున్నారని ఆయన శుక్రవారం మీడియాతో అన్నారు. కాంగ్రెసు పార్టీని ఓడించింది రైతులేనని ఆయన అన్నారు. ఆ విషయం కాంగ్రెసు నేత రాహుల్ గాంధీ గుర్తుంచుకోవాలని అన్నారు. బీహార్ రాష్ట్రంలో బిజెపి జెండా ఎగురుతుందని చెప్పారు.
ఇదిలావుంటే, దీన్దయాల్ ఓ స్వప్నికుడు, ఆయన జీవితం ఆదర్శనీయమని కేంద్రమంత్రి వెంకయ్య శ్లాఘించారు. బీజేపీ ఆఫీసులో పండిట్ దీన్దయాల్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జాతి పునరుజ్జీవనానికి దీన్దయాల్ ఆనాడే బీజం వేశారని గుర్తు చేశారు.

అట్టడుగువర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాలని చెప్పిన మహనీయుడు దీన్దయాళ్ అని ఆయన కొనియాడారు. కమ్యూనిస్టుల సిద్ధాంతాలు ఆచరణనీయం కాదని వెంకయ్య స్ఫష్టం చేశారు. వామపక్ష భావాలు ఇంకా ప్రభావితం చేస్తాయనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
సిద్ధాంతపరమైన ఓటమిని కమ్యూనిస్టులు ఎప్పుడూ అంగీకరించడంలేదని దుయ్యబట్టారు. కమ్యూనిస్టుల ప్రభావం పరిమితమని స్పష్టం చేశారు. కానీ వారికి ప్రచారం అపరిమితమని చెప్పారు. దేశం మొత్తం బీజేపీ వైపు చూస్తోందని వెంకయ్య అన్నారు. ప్రతిపక్షాలు చిన్న విషయాన్ని పెద్దగా చేస్తూ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.












Click it and Unblock the Notifications