'రేపటి ఆర్కే బీచ్ నిరసనలకు ఎవరొస్తారో.. ఎవరు నడిపిస్తారో..'
పటి వైజాగ్ ఆర్కే బీచ్ నిరసనలకు ఎవరు వస్తారో ఎవరు నడిపిస్తారో అందరూ చూస్తారని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: ప్రస్తుతం ఏపీలో ఎక్కడ విన్నా ప్రత్యేక హోదా మాటే. ప్రతిపక్ష అధినేత జగన్ రేపటి విశాఖ బీచ్ వేదికగా జరగబోయే నిరసన కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు.
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తాజాగా దీనిపై స్పందించారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరి వాదన వారు చెప్పుకునే హక్కు ఉందని చెప్పుకొచ్చిన వెంకయ్య..రేపటి నిరసనలకు ఎవరు వస్తారో ఎవరు నడిపిస్తారో అందరూ చూస్తారని వ్యాఖ్యానించడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కావాల్సిన నిధులు అందిస్తూనే ఉందన్నారు.
తక్కువ సమయంలో ఎక్కువ నిధులు కేంద్రం మంజూరైనట్టుగా చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికి ఇంత తక్కువ సమయంలో ఇన్ని ఎక్కువ ప్రాజెక్టులు, నిధులు మంజూరు చేయలేదని చెప్పారు.
పెట్టుబడుల సదస్సుల వల్ల ఉద్యోగవకాశాలు పెరుగుతాయని, ప్రజలుఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని కేంద్ర సర్కార్ సవరిస్తుందని వెంకయ్య భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదే విషయాన్ని పార్లమెంట్ బయట, లోపల ప్రస్తావిస్తున్నామని వెంకయ్య పేర్కొన్నారు.