రాహుల్ స్పందన హాస్యాస్పదం: బిల్లులో ఎందుకు పెట్టలేదని వెంకయ్య వ్యంగ్యం
హైదరాబాద్: ఏపీకి ప్రత్యేకహోదా కల్పించే విషయంలో ఎన్డీఏ, బీజేపీపై మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేకహోదాపై కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని విమర్శించారు.
తన హామీలపై రాజ్యసభలో శుక్రవారం మాట్లాడిన మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్ ఆనాడు బిల్లులో ఏపీకి ప్రత్యేకహోదా ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై రాహుల్ గాంధీ స్పందించిన విషయాన్ని వెంకయ్య ప్రస్తావించారు.
తెలుగు నేలను రెండు రాష్ట్రాలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీ, ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. ఏపీకి అన్యాయం చేసిన పార్టీ ముమ్మాటికీ కాంగ్రెస్సేనని ఆయన ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాహుల్ గాంధీ ఏపీకి ప్రత్యేక హోదాపై స్పందించడం హాస్యాస్పదంగా ఉందని ఆయన మండిపడ్డారు.
ప్రత్యేక హోదాపై ఆర్థికమంత్రి, నీతి ఆయోగ్ ఛైర్మన్ కసరత్తు చేస్తున్నారని, త్వరలోనే స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. లోక్సభ సాక్షిగా వీరప్పమొయిలీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని కోరారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే పొరుగు రాష్ట్రాల నుంచి పెట్టుబడులు తరలిపోతాయని ఆయన హెచ్చరించారని తెలిపారు.
ఇదిలా ఉంటే ఏపీకి ప్రత్యేకహోదా లేక ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కేంద్రం నుంచి కొంత మేర సానుకూలత వ్యక్తమైనట్లు సమాచారం. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పరిణామాలను పరిశీలిస్తే అదే వ్యక్తమవుతోంది. వెంకయ్య నాయుడు నిన్న మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేసినట్లేనని వ్యాఖ్యానించారు.
శుక్రవారం టీడీపీ ఎంపీలు ప్రధాని మోడీని కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మంత్ర పఠనంతో మోడీ పగలబడి నవ్వరంటూ వార్తలు వచ్చాయి. ఈ విషయంపైనే వెంకయ్య టీడీపీ నేతలతో కీలక వ్యాఖ్య చేశారు. ప్రధాని మోడీ అంతగా పగలబడి నవ్వారంటే మీ పని అయిపోయినట్లేనని, ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేసినట్లేనని కూడా ఆయన చెప్పారట.