‘ఐ యామ్ రిటైర్డ్, నాట్ టైర్డ్’:తన తీరని కోరికపై వెంకయ్య ఇలా
ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన తాను ఆ పదవి స్థాయిని పెంచేందుకు కృషి చేస్తానని వెంకయ్యనాయుడు అన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చి 40 ఏళ్లు పూర్తయ్యిందన్నారు.
అమరావతి: ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన తాను ఆ పదవి స్థాయిని పెంచేందుకు కృషి చేస్తానని వెంకయ్యనాయుడు అన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చి 40 ఏళ్లు పూర్తయ్యిందన్నారు. 'నేను రాజకీయాల నుంచి రిటైర్డ్ అయినప్పటికీ ఐయామ్ నాట్ టైర్డ్' అంటూ తన వాగ్దాటిని మరోసారి చాటారు.

అప్పుడే అభివృద్ది చెందినట్లు..
ఆకలి, అవిద్య, అసమానతలు తొలిగినప్పుడే దేశం అభివృద్ధి చెందినట్లు అన్నారు. ప్రధాని, సీఎం, మంత్రి నీతిమంతంగా ఉన్నంత మాత్రాన అవినీతి లేనట్లు కాదని, కిందిస్థాయిలో కూడా పరిస్థితి మారాలన్నారు. నేటికీ కులం పేరుతోనూ, మతం పేరుతోనూ వివక్ష చూపడం సరికాదన్నారు. ప్రజలకు ప్రభుత్వాలు నమ్మకం కలిగించాలని అన్నారు. వారిలో ఉన్న అసంతృప్తిని తొలగించేందుకు ప్రయత్నించాలన్నారు.

పరిపాలన భాషగా తెలుగు..
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిలిద్దరూ కలిసే ఉండాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మనసు విప్పి మాట్లాడుకుని సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. తెలుగులోనే మాట్లాడుకోవాలని, తెలుగుభాషను రక్షించుకోవాలని ఇరు రాష్ట్రాలకు సూచించారు. తెలుగును పరిపాలనా భాషగా మార్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు.

రాష్ట్రం కోసం కదిలా..
విభజన బిల్లుపై చర్చ సందర్భంగా ఏపీ తరఫున ఎంపీని కానప్పటికీ ఒక జాతీయ పార్టీ నాయకుడిగా ఒక రాష్ట్రంలోని ఒక ప్రాంతం గురించి రాజ్యసభలో మాట్లాడడం సరికాదని అనిపించిందన్నారు. అయినా మూడు రోజుల పాటు ఆలోచించాక రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే చూడలేక రాష్ట్రం తరఫున మాట్లాడానని వెంకయ్య చెప్పారు. ఏ రాష్ట్రానికీ చేయని స్థాయిలో ఏపీకి న్యాయం చేశానని అన్నారు.

తీరని కోరిక..
2020 తర్వాత ప్రజల్లో ఉండాలన్నదే తన కోరిక అని, కానీ అది తీరలేదని వెంకయ్య చెప్పారు. 2019లో బీజేపీని గెలిపించాక పార్లమెంట్ సభ్యుడిగా రాజీనామా చేసి 2020 సంక్రాంతికి ఇంటికెళ్లి పండగ జరపుకోవాలని అనుకున్నాని చెప్పారు. ఆ తర్వాత సమాజ సేవలో ఉండాలన్నదే తన కోరిక అని వెంకయ్య చెప్పారు. ఈ విషయాన్ని తన భార్యకు ఎప్పుడో చెప్పానని అన్నారు. ఉప రాష్ట్రపతిగా ఎన్నికయ్యాక ఆ కోరిక తీరే అవకాశం లేకుండా పోయిందన్నారు. ఏ పదవిలో ఉన్నా తెలుగువారికి చేయాల్సింది చేస్తానని వెంకయ్య స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications