సోనియాతో వెంకయ్య భేటీ: 'తెలుగుపై ఆంక్షలు విధించడం శోచనీయం'
న్యూఢిల్లీ: తమిళనాడులో తెలుగు నేర్చుకోకుండా చేయడం దురదృష్టకరమని కేంద్రమంత్రి వెంకయ్యనాయడు అన్నారు. ఢిల్లీలో గురువారం ఆంధ్రా అసోసియేషన్ క్యాలెండర్ను ఆవిష్కరించిన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలుగు వారు ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారన్నారు.
అయితే తమిళనాడులో తెలుగుపై ఆంక్షలు విధించడం శోచనీయమన్నారు. ఈ పరిణామంతో జాతీయ సమగ్రతకు విఘాతం కలుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మాతృభాషను ఎవరూ మరిచిపోకూడదని సూచించారు. ఏ రాష్ట్రంలో ఉన్నా సొంత భాషను నేర్చుకునే అవకాశం మనకు రాజ్యాంగం కల్పించిందన్నారు. తెలుగువారు అనేక సంస్థలకు అధిపతులు కావడం గర్వకారణమన్నారు.
ఢిల్లీలోని ఆంధ్రా అసోసియేషన్ తెలుగువారిని ఏకం చేయడంలో మందుందన్నారు. అలాగే అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ తెలుగు భాష మరింత వ్యాప్తిచెందేందుకు పాటుపడుతుందన్నారు. ఈ కార్యక్రమం అనంతరం సోనియా నివాసంలో గురువారం ఉదయం ఆమెతో భేటీ అయ్యారు.
ఈ భేటీలో పార్లమెంట్ సమావేశాలు, పెండింగ్ బిల్లులపై చర్చించినట్లు సమాచారం. అనంతరం వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ, గత చర్చల ఆధారంగా కాంగ్రెస్ తన వైఖరిపై నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు చెప్పానన్నారు. ఈ విషయమై పార్టీలో చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటామని సోనియా చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.
సమావేశాలు సజావుగా సాగాలంటే కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా వ్యవహరించాలన్న విషయాన్ని ప్రస్తావించానన్నారు. గతంలో కాంగ్రెస్ లేవనెత్తిన మూడు అంశాలపై ఆర్థికమంత్రి జవాబు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమెకు గుర్తుచేసినట్లు వెంకయ్యనాయుడు చెప్పారు.
మరోవైపు తమిళనాడులో తెలుగు విద్యార్ధుల విషయంలో ఆ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్నే ఇక్కడి తమిళ విద్యార్ధుల విషయంలోనూ ఏపీ ప్రభుత్వం అమలు చేయాలని హిందీ అకాడమీ ఛైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. రాష్ట్రంలోని తమిళ పాఠశాలల్లోని విద్యార్ధులు తెలుగులోనే పరీక్షలు రాయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశిస్తేనే తమిళనాడులోని జయ ప్రభుత్వం దిగివస్తుందని ఆయన తెలిపారు.