ఏపీకి మోడీ ఇచ్చిన వరం: వెంకయ్య, కేంద్రం నిధులిస్తోందని బాబు
విశాఖ: విభజన ద్వారా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకుంటుందని, ఏపీకి పోలవరం ప్రాజెక్టు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన వరమని కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు శుక్రవారం నాడు అన్నారు.
కేంద్రంతో కలిసి పని చేస్తే రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమన్నారు. విశాఖ-చెన్నై కారిడార్తో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, పెట్టుబడులు పెట్టే వారికి అన్ని రకాల పోత్సాహకాలు అందిస్తామని వెంకయ్య నాయుడు తెలిపారు.
విశాఖలో భారత అంతర్జాతీయ సముద్ర ఉత్పత్తుల ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోయాయని చెప్పారు. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో భారత్ అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు సముద్ర ఆహార ఉత్పత్తుల్లో విశాఖ ముందుందని చెప్పారు.
విశాఖ సుందర నగరం: చంద్రబాబు
విశాఖ సుందరమైన ప్రదేశమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో సముద్ర ఉత్పత్తుల ప్రదర్శన సంతోషకరమని, సముద్ర, ఆక్వా ఉత్పత్తుల వ్యాపారాన్ని వృద్ధి చెందాలన్నారు. అలాగే భారత్లో మత్స్యసంపద అపారమని, మత్స్యసంపదను వినియోగించుకోవాల్సి ఉందన్నారు.
ఏపీ నుంచి 2.35మెట్రిక్ టన్నుల మత్స్య సంపద ఎగుమతి జరుగుతోందన్నారు. 70శాతం ఎగుమతి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అలాగే కోల్డ్ స్టోరేజీలకు సబ్సిడీ ఇస్తున్నామని, మత్స్య పరిశ్రమను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. ఆక్వా ఉత్పత్తుల అభివృద్ధికి రాయితీ ఇస్తున్నామని, నిధులకు ఇబ్బంది లేదని, కేంద్రం కూడా నిధులు ఇస్తోందన్నారు.