ఏం చేసిందని: వెంకయ్య ప్రశ్న, విభజనతో అన్యాయం: డిగ్గీ
విశాఖపట్నం/ విజయవాడ: అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్నదే ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్ష అని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. పేదరిక నిర్మూలనకు సంస్కరణను తేవాల్సి ఉందని, ప్రధాని నరేంద్ర మోదీ ఆ దిశగానే నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. విశాఖ జిల్లాలో తాను దత్తత తీసుకున్న చేపలుప్పాడ గ్రామంలో శుక్రవారం పర్యటించారు.
ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ - కాంగ్రెస్ పార్టీ తన 60 ఏళ్ల పాలనలో ప్రజల కోసం ఏం చేసిందని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చి 8 నెలలు కాలేదు.. అప్పుడే ప్రశ్నిస్తున్నారని కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. ఆంధ్రలోని కాంగ్రెస్ మాజీ మంత్రులు ఖాళీగా ఉండటంతో ఏం చేయాలో తోచక కోటి సంతకాలు అంటూ ప్రజల చుట్టూ తిరుగుతున్నారని వెంకయ్య ఎద్దేవా చేశారు.

ఏపీకి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ఆయన పునరుద్ఘాటించారు. రాష్ర్టానికి ప్రత్యేక రాయితీలు, ప్రత్యేక హోదా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ఈ పర్యటనలో వెంకయ్య నాయుడుతో పాటు మరో కేంద్ర మంత్రి అశోక్ గెహ్లట్ విశాఖలో పర్యటించారు.
రాష్ట్ర విభజనకు బీజేపీ, తెలుగుదేశం, వైసీపీ పార్టీలు మద్దతు ప్రకటించిన తర్వాతే యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్సింగ్ అన్నారు. టీడీపీ, వైసీపీలు లేఖలు కూడా ఇచ్చాయని ఆయన అన్నారు. అయితే అన్ని పార్టీలు బాగానే ఉన్నాయని.. నింద మాత్రం కాంగ్రెస్ పార్టీపై పడిందని దిగ్విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
శుక్రవారం విజయవాడలో జరిగిన కాంగ్రెస్ మేధోమథన సదస్సులో దిగ్విజయ్సింగ్ పాల్గొన్నారు. రాష్ర్టాన్ని విభజించిన ఏపీకు అన్యాయం జరగకుండా ప్రత్యేక ప్రతిపత్తి కల్పించేలా బిల్లు రూపొందించామని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన వారందరికీ అన్యాయం జరిగిందని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications