ఇంత అద్దెలా, బెజవాడవాసులు మారాలి: బాబు, వెంకయ్య ప్రశంస
విజయవాడ: కృష్ణా జిల్లా విజయవాడలో ఇంటి అద్దెలు బాగా పెరిగాయని, ఉద్యోగులను తరలిరావాలని కోరితే అద్దె విషయాలను ప్రస్తావిస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం అన్నారు. బెజవాడ నగరవాసుల దృక్పథంలోనూ మార్పు రావాలని ఆకాంక్షించారు.
రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టుల మంజూరులో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడి కృషిని మరచిపోలేమన్నారు. కనకదుర్మమ్మ ఫ్లై ఓవర్కు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేసిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. రూ.65వేల కోట్ల విలువైన రహదారి ప్రాజెక్టులను గడ్కరీ మంజూరు చేయడం అభినందనీయమన్నారు.
ఈ ప్రాజెక్టుల నమూనా (బ్లూప్రింట్), అలైన్మెంట్ ప్రణాళికతో త్వరలోనే కలుస్తామని తెలిపారు. పనులను మూడేళ్లలో పూర్తి చేయాలని విన్నవించారు. రాయలసీమసీమ 4 జిల్లాల నుంచి అమరావతికి నాలుగు గంటల వ్యవధిలో చేరుకునేలా రహదారుల్ని అభివృద్ధి చేయాలని సంకల్పించామన్నారు.
అమరావతి నుంచి బెంగళూరు, హైదరాబాద్లకు అనుసంధానమయ్యేలా రహదారులుంటే అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు.
విజయవాడ చరిత్రలో పైవంతెన శంకుస్థాపన మరచిపోలేనిదని, దీని కోసం తాను కూడా మహాధర్నా చేశానని గుర్తు చేశారు. కృష్ణా పుష్కరాల నాటికి పూర్తి చేస్తామని, అమ్మవారి దయతో మొదలైనందున పైవంతెనకు కనకదుర్గ పేరు పెడుతున్నామని ప్రకటించారు.
చంద్రబాబుకు వెంకయ్య ప్రశంస
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏపీ అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధిలోనూ ముందుంటుందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్వాళ్లు ముందుంటారని వ్యాఖ్యానించారు.
రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే ఉన్నామన్నారు. ఏనాడూ అభివృద్ధి ప్రాజెక్టులకు సంతకాలు పెట్టనివాళ్లు ఇప్పుడు సంతకాలు సేకరిస్తున్నారంటూ కాంగ్రెస్పై మండిపడ్డారు. పెట్టుబడులకు అనుకూలమైన మన దేశంలో ఆకర్షణీయమైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనీ, అందుకే విదేశీ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెడతామంటున్నాయన్నారు.
రాష్ట్ర అవసరాలను కేంద్రం ఎప్పటికప్పుడు తీరుస్తుందని, ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర మంత్రి సుజనాచౌదరి మాట్లాడుతూ... రాష్ట్రానికి ఉన్న విశాల తీరం ద్వారా అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయని అన్నారు.