ఎంతోమంది చనిపోయాక టీ ఇచ్చారు, మేమలా చేయం: వెంకయ్య, టీడీపీ మా దోస్త్!
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను అన్నింటిని నెరవేరుస్తామని, అయితే వందలాదిమంది ఆత్మహత్య చేసుకున్నాక.. చాలా ఆలస్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినట్లుగా, తాము మాత్రం కేంద్రం ఇచ్చిన హామీల పైన ఆలస్యం చేయమని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు లోకసభలో అన్నారు. విభజన బిల్లు పైన చర్చ సమయంలో వెంకయ్య మాట్లాడారు.
విభజన బిల్లులో చాలా లోపాలు ఉన్నాయని చెప్పారు. ఏపీకి ఎమ్మెల్సీ కేటాయింపుల అంశాన్ని సవరించినట్లు చెప్పారు. సోనియా గాంధీ తెలంగాణ పైన 2004లో హామీ ఇచ్చారని, కానీ 2014 దాకా ఎందుకు ఆగారో చెప్పాలని ప్రశ్నించారు. 9 సంవత్సరాల 9 నెలల తర్వాతనైనా సోనియా గాంధీ స్పందించడం హర్షణీయమన్నారు. తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ కాంగ్రెస్ పార్టీదే కాదన్నారు.
ప్రత్యేక రాయితీలొద్దని మొయిలీ చెప్పారు
ప్రత్యేక తెలంగాణకు అన్ని పార్టీలు మద్దతు పలికాయని చెప్పారు. వందలమంది ఆత్మత్యాగాలు చేసుకునే వరకు ఎందుకు తెలంగాణ ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీని నిలదీశారు. ఏపీకి, తెలంగాణకు ప్రత్యేక రాయితీలు, హామీలు అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ నేత వీరప్ప మొయిలీయే చెప్పారని మండిపడ్డారు.
హామీలు నెరవేర్చుతున్నాం
తాము ఒక్కటొక్కటిగా హామీలు నెరవేర్చుతున్నామని వెంకయ్య నాయుడు చెప్పారు. తెలంగాణ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నట్లుగా తాము చాలా సమయం తీసుకోమన్నారు. గుంటూరులో ఎయిమ్స్కు స్థల పరిశీలన జరుగుతోందన్నారు. ఏపీకి ఉన్న రెవెన్యూ లోటు ప్రతి రూపాయి కేంద్రం భరిస్తుందని ఆర్థిక శాఖ మంత్రి స్వయంగా చెప్పారన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నాయని చెప్పారు.
బిల్లులో చెప్పిన విధంగా ఐఐఎంకు శంకుస్థాపన జరిగిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సోనియా బహుమతి అని, ప్రత్యేక తెలంగాణ సోనియా వరమని చెప్పారని, కానీ ఏదీ పూర్తి చేయలేదన్నారు. ప్రత్యేక హోదా పైన యూపీఏ రాజ్యసభలో చెప్పిందని, లోకసభలో మాత్రం మాట్లాడలేదన్నారు. తాను కూడా రాజ్యసభలో మాట్లాడినట్లు చెప్పారు.
పోలవరంపై...
పోలవరం విషయంలో చాలా సమస్యలు ఉన్నాయన్నారు. యూపీఏ ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. తాము మాత్రం మొదటి మంత్రివర్గంలోనే దీనిని ఇచ్చామన్నారు. ప్రతి శాఖ, ప్రతి మంత్రి కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హామీలపై చిత్తశుద్ధితో ఉన్నారని చెప్పారు. అధికారుల విభజనలో కూడా జాప్యం జరిగిందన్నారు. పోలవరం అథారిటీ పై సంబంధిత మంత్రితో మాట్లాడుతామని చెప్పారు. బిల్లులో పోలవరం ఆర్డినెన్స్ లేకున్నప్పటికీ తాము పూర్తి చేశామన్నారు.
బీజేపీ, టీడీపీ కలిసే ఉన్నాయి, మీకు నచ్చకుంటే ఏం చేయలేం
ఆంధ్రప్రదేశ్లో, కేంద్రంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు కలిసి పని చేస్తున్నాయన్నారు. తమ కలయిక కొందరికి నచ్చక పోవచ్చునన్నారు. దానికి తాము ఏం చేయలేమని ఎద్దేవా చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధిపై చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పారు.
కట్టుబడి ఉన్నాం: మొయిలీ
ఆంధ్రప్రదేశ్ పైన ఇచ్చిన హామీల పైన కట్టుబడి ఉన్నామని మాజీ కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ అన్నారు. ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీల పైన తాము రెండుసార్లు ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశామని సోనియా గాంధీ లోకసభలో అన్నారు.