కొత్త పార్టీలతో ఏంకాదు: వెంకయ్య, పురంధేశ్వరి ఆగ్రహం
చిత్తూరు: ఎన్ని కొత్త పార్టీలు వచ్చినా ఎలాంటి ఉపయోగం ఉండదని, ప్రజలంతా కాంగ్రెసు పోవాలి.. మోడీ రావాలనుకుంటున్నారని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు సోమవారం మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, హీరో పవన్ కల్యాణ్ పార్టీలను ఉద్దేశించి అన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో మోడీ ఫర్ పిఎం కార్యక్రమంలో వెంకయ్య, మాజీ కేంద్రమంత్రులు దగ్గుబాటి పురంధేశ్వరి, కృష్ణం రాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సీమాంధ్ర అభివృద్ధి ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. సీమాంధ్ర నేతల కోసం కాంగ్రెసు పార్టీ ఆలోచించలేదని, కేవలం తెలంగాణ ఉంటే చాలనుకుందన్నారు. నమ్ముకున్న సీమాంధ్ర నేతలను నట్టేట ముంచిందన్నారు. సీనియర్ నేతలు జెసి దివాకర్ రెడ్డి, గల్లా అరుణ కుమారి, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వారిని పట్టించుకోలేదని ఆరోపించారు. సీమాంధ్ర నేతలు గంగలో కలినా పరవాలేదనున్నారని మండిపడ్డారు. సీమాంధ్రకు న్యాయం చేసిన బిజెపిని ప్రజలు ఆదరించాలని కోరారు.
అరిచినా.. గీపెట్టినా... : వెంకయ్య
ఎవరు అరిచినా.. గీపెట్టినా, ఎన్ని పార్టీలు వచ్చనా మోడీని ఎవరు అడ్డుకోలేరన్నారు. ఏ నలుగురు కలిసినా.. కాంగ్రెసు పోవాలి, మోడీ రావాలని అనుకుంటున్నారన్నారు. ఎన్ని వేశాలు వేసినా మోడీ గెలుపును ఆపలేరన్నారు. కొత్త పార్టీలు వచ్చినా ఉపయోగముండదని చెప్పారు.
కాంగ్రెసు పాలనలో ఎటు చూసినా కుంభకోణాలే అన్నారు. యూపిఏ హయాంలో ధరలు ఆకాశంలో ఉంటే.. ప్రజలు పాతాళంలో ఉన్నారన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావని, దేశ భవిష్యత్తును నిర్ణయించేవన్నారు. ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీని చిత్తు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సీమాంధ్ర అభివృద్ధిపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదన్నారు. పోలవరం ముంపు గ్రామాలపై ఆర్డినెన్స్ ఎందుకు తీసుకు రాలేదన్నారు.