ఆవేదన: కాంగ్రెస్ దుర్మార్గంపై ఉండవల్లి పుస్తకం చదవాలన్న వెంకయ్య
అమరావతి: ఏపీ విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాసిన పుస్తకం చదివితే అందరికీ అర్ధం అవుతుందని కేంద్ర మంత్రి వెంక్య నాయుడు అన్నారు. సోమవారం రాజమండ్రిలోని మధురపూడి విమానాశ్రయం రన్ వే విస్తరణ పనులకు సీఎం చంద్రబాబుతో కలిసి ఆయన భూమిపూజలో పాల్గొన్నారు.
అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ రూ. 181 కోట్లతో ఎయిర్పోర్టు రన్వే విస్తరణ జరుగుతుందని చెప్పారు. ఏపీకి కేంద్రం చేయూతనిస్తుందని అన్నారు. విభజనపై ఉండవల్లి ఏమీ చేయలేక పుస్తకంలో తన ఆవేదనను వెళ్లగక్కారని అన్నారు. ఎయిర్బస్ 320 విమానం సైతం మధురపూడి ఎయిర్పోర్టులో దిగేలా రన్వే అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.
ఏపీకి ప్రస్తుతం కావాల్సింది ఆదా కానీ హోదా కాదని అన్నారు. రాష్ట్రంలో పదేళ్లలో పెడతామన్న సంస్థలను రెండేళ్లలో పెట్టడం నేరమా? అని ప్రశ్నించారు. చట్టంలో పదేళ్ల సమయం ఎందుకు పెట్టారో సమాధానం చెప్పాలని కాంగ్రెస్ను ప్రశ్నించారు. 2019లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలంటూ కాంగ్రెస్ పార్టీకి చురక అంటించారు.
ఏపీకి జరిగిన అన్యాయం సరిదిద్దాలని 28 అంశాలపై పార్లమెంట్లో తాను మాట్లాడానని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాను ఏపీ నుంచి ఎంపీగా ఎన్నిక కాకపోయినా రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ఆనాడు రాజ్యసభలో మాట్లాడానని అన్నారు. పోలవరం ప్రాజెక్టు 1981లో ప్రారంభమైనప్పటికీ 2016 నాటికి ఎందుకు పూర్తిచేయలేకపోయారో చెప్పాలని ఆయన నిలదీశారు.
ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తెలంగాణలోని 7 మండలాలను విలీనం చేయాలని తొలి కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నామని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నూరు శాతం నిధులు ఇస్తామని, హోదాకు మించిన ప్యాకేజీని ఏపీకి ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
పోలవరం నిర్మాణానికి వంద శాతం ఖర్చును కేంద్రమే భరిస్తుందని అన్నారు. సీఎం చంద్రబాబు సమర్థుడు కాబట్టే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను రాష్ట్రానికి అప్పగించినట్లు ఆయన తెలిపారు. హోదాపా ఆనాడు మాట్లాడరని వారంతా ఇప్పుడు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఆనాడే కాంగ్రెస్ ఎంపీలంతా రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని సోనియా గాంధీకి ధైర్యంగా చెప్పి ఉంటే నేడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. ఏపీకి ఏం కావాలో నాడు కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు మాట్లాడలేదని వెంకయ్య ప్రశ్నించారు. ఏపీకి అన్యాయం జరుగుతుందనే ఆనాడు గళం విప్పానని, అప్పుడు ఏపీ ఎంపీలు గట్టిగా నిలదీస్తే కాంగ్రెస్ ప్రత్యేకహోదాను చట్టంలో చేర్చేదని ఆయన అన్నారు.
మేము సహకరిస్తామన్నా కాంగ్రెస్ పట్టించుకోలేదని వెంకయ్య ఆరోపించారు. ఈ రెండేళ్లలోనే ఆంధ్రప్రదేశ్ను వెలుగుల ప్రదేశ్గా మార్చామని చెప్పారు. అవకాశాలు ఉన్న ప్రతిచోటా రాష్ట్రానికి న్యాయం చేసేందుకే కేంద్రం ప్రయత్నిస్తోందని వెంకయ్య చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతోపాటు కేంద్ర మంత్రులు అశోక్గజపతి, సుజనా చౌదరి, రాష్ట్ర మంత్రులు, ముఖ్య అధికారులు పాల్గొన్నారు.