కెవిపి బిల్లు: హోదాపై చేతులు దులిపేసుకున్న వెంకయ్య
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంపై కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు చేతులు దులిపేసుకున్నట్లే కనిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్రతిపత్తిని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సభ్యుడు కెవిపి.రామచందర్రావు రాజ్యసభలో ప్రతిపాదించిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు ఆమోదం లభించినప్పటికీ దాన్ని అమలు చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉండదని ఆయన తేల్చి చెప్పారు.
సోమవారం ఆయన తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ప్రైవేట్ మెంబర్ బిల్లులను ఆమలు చేయాలనే నిబంధన లేదని ఆయన స్పష్టం చేసారు. విభజన అనంతరం ఏపికి ఐదేళ్లు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తామంటూ అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పార్లమెంట్లో ఇచ్చిన హామీని అమలు చేయాలని రామచందర్రావు రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రతిపాదించిన విషయం విదితమే.
ఈ బిల్లుపై పలు దఫాలుగా జరిగిన చర్చ శుక్రవారం తుది దశకు చేరింది. దీనిపై కేంద్ర హోం శాఖ మంత్రి హరీభాయి చౌదరి సమాధానమిచ్చారు. చట్టలో ఇచ్చిన పలు హామీలను ఎన్డిఏ ప్రభుత్వం అమలు చేసిందని చెప్పారు.
పది ఉన్నత స్థాయి సంస్థలు, విద్యా సంస్థలను ఏర్పాటు చేయటంతోపాటు రాష్ట్రానికి దాదాపు తొంబై వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేశామని ఆయన చెప్పారు.
మంత్రి చాలా విస్తృతమైన సమాధానం ఇచ్చినందున రామచందర్రావు ప్రైవేట్ మెంబర్ బిల్లును ఉపసంహరించుకోవాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ విజ్ఞప్తి చేశారు. ఈ దశలో తెలుగుదేశం సభ్యుడు లేచి సభలో కోరం లేనందున బిల్లుపై చర్చ కొనసాగించటం మంచిది కాదన్నారు. దీంతో రామచందర్రావు మాట్లాడుతూ, మొదట సభలో కోరం ఉండేలా చూడాలని, ఆ తర్వాతే తాను మాట్లాడుతానని స్పష్టం చేశారు.
ఐదు నిమిషాల పాటు గంట మోగించినప్పటికీ కోరం లేకపోవడంతో ప్యానల్ చైర్మన్ సభను వాయిదా వేయవలసి వచ్చింది. కోరం లేకపోవటంతో మధ్యలోనే ఆగిపోయిన రామచందర్రావు ప్రైవేట్ మెంబర్ బిల్లుపై వచ్చే శుక్రవారం ఓటింగ్ జరిగే అవకాశాలున్నాయి.
రామచందర్రావుది ప్రైవేట్ మెంబర్ బిల్లు కాబట్టి అది రాజ్యసభలో ఆమోదం పొందినప్పటికీ దానిని అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉండదని వెంకయ్య నాయుడు చెబుతున్నారు. ఆ బిల్లు ఆమోదం పొందితే ఏం జరుగుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగా అది కాంగ్రెసుకు అస్త్రంగా మారే అవకాశం ఉంది.