బతికించుకుంటే మంచిది: చిరుకు వెంకయ్య సలహా
న్యూఢిల్లీ: తమ పార్టీపై కాంగ్రెసు సీమాంధ్ర ప్రచార కమిటీ చైర్మన్, కేంద్ర మంత్రి చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడు ప్రతిస్పందించారు. తమపై విమర్శలు మాని చావు బతుకుల మధ్య ఉన్న కాంగ్రెసును బతికించుకోవడానికి ప్రయత్నిస్తే మంచిదని ఆయన చిరంజీవికి సలహా ఇచ్చారు. పొత్తు విషయంలో తమ పార్టీ బలంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యపై కూడా ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రతిస్పందించారు.
పొత్తు కోరుకునే మిత్రపక్షాలు తమను తాము ఎక్కువగా అంచనా వేసుకోవడం తగదని ఆయన అన్నారు పొత్తు కోసం సహేతకుమైన ప్రాతిపదిక ఉండాలని ఆయన అన్నారు. 2009 ఎన్నికలకు, ప్రస్తుత ఎన్నికలకు మధ్య చాలా తేడా ఉందని, దేశవ్యాప్తంగా తమ నేత నరేంద్ర మోడీ గాలి వీస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ, సీమాంధ్రల్లో కూడా మోడీ గాలి వీస్తోందని ఆయన అన్నారు. మోడీకి ఓటేయాలనే నిర్ణయానికి ప్రజలు వచ్చారని ఆయన చెప్పారు.
వ్యక్తిత్వం, ప్రజామోదం, పనితీరు ఆధారం చేసుకుని ఎవరైనానా పార్టీలో చేర్చుకుంటామని ఆయన చెప్పారు. ఆధార్ కార్డు వ్యవహారంపై బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ జరిపిస్తామని ఆయన చెప్పారు.
ప్రతి సీమాంధ్ర జిల్లాను హైదరాబాద్ చేస్తామని చిరంజీవి చేసిన ప్రకటనపై కూడా ఆయన స్పందించారు. ఇప్పటి వరకు ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు.