2004లో తెలంగాణ ఇస్తామని: హోదాపై వెంకయ్య కౌంటర్, అడగ్గానే ఇచ్చాం: సినిమాపై బాబు
విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చుట్టూ రింగ్ రోడ్డుకు కేంద్రం సహకరిస్తుందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సోమవారం నాడు చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖ విమానాశ్రయంలో సుందరీకరణ పనులను ప్రారంభించారు. ఫిలింనగర్ కల్చరర్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు, వెంకయ్యలు మాట్లాడారు. వెంకయ్య మాట్లాడుతూ.... ప్రభుత్వంలో ఉన్నవాడు పని చేయాలని, ప్రతిపక్షంలో ఉన్నవాడు మాట్లాడాలన్నారు. ప్రత్యేక హోదా పైన మాట్లాడడం లేదని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని, ప్రతిరోజూ మాట్లాడడమే పనా? అని ప్రశ్నించారు.
మాట కంటే చేతలు ముఖ్యమని కౌంటర్ ఇచ్చారు. తాము పని చేస్తున్నామని, మాట్లాడడం లేదన్నారు. ఏపీని అన్ని రకాలుగా ఆదుకునేందుకు కేంద్రం చిత్తశుద్ధితో ఉందన్నారు. విశాఖకు మెట్రో రైలు ఇచ్చామన్నారు. పోలవరం పూర్తి చేసేందుకు కేంద్రం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు.

రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కేంద్రం ఆదుకుంటుందన్నారు. రాజధాని చుట్టూ రింగ్ రోడ్డుకు కేంద్రం సహకరిస్తుంనద్నారు. తాము విపక్షాల్లా మాట్లాడమని, చేతల్లో చూపిస్తామన్నారు. నాడు కాంగ్రెస్ పార్టీ 2004లో తెలంగాణ ఇస్తానని చెప్పిందని, ఆ తర్వాత ఎంతోమంది చనిపోయాక 2014లో ఇచ్చిందన్నారు.
తెలంగాణ వచ్చాక ఏపీకి నష్టం జరగకుండా ఉండేందుకు తాము హామీ ఇచ్చామన్నారు. వాటిని చేతల్లో చూపిస్తామన్నారు. అమరావతిలో మంచి భూగర్భ జల వ్యవస్థకు నిధులను కేంద్రం అందిస్తుందని వెంకయ్య నాయుడు చెప్పారు.

అడగ్గానే ఇచ్చాం: చంద్రబాబు
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు విశాఖ కేంద్రంగా మారాలని చంద్రబాబు ఆకాక్షించారు. చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామన్నారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్కు అడిగిన వెంటనే భూమిని కేటాయించామన్నారు.

హైదరాబాద్లో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎన్టీఆర్, ఎఎన్నార్లే కారణమన్నారు. హుధుద్ తుపాను సమయంలో విశాఖ ప్రజలు అందించిన సహకారం జీవితంలో మరిచిపోలేనన్నారు. విభజన సమయంలో ఇచ్చిన హామీల కంటే కేంద్రం ఎక్కువ సహకరిస్తోందన్నారు. విశాఖను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. నగరంలో 5 లక్షల మొక్కలు నాటాలని సంకల్పించామన్నారు.












Click it and Unblock the Notifications