ఎన్ని కోట్లిచ్చినా.. హోదాతోనే: సుజనా, సంతోష పెడ్తామని జైట్లీ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో టిడిపి ఎంపీ, కేంద్రమంత్రి సుజనా చౌదరికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ఏపీకి హోదా విషయమై సోమవారం సుజనా చౌదరి.. అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు.
వీరి భేటీకి ముందు జరిగిన పరిణామాలను గమనించినట్లయితే.. మిత్రపక్షం టిడిపి అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిరసన గళం విప్పడంతో కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ కదలిక వచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వలేమని తేల్చేసిన కేంద్రం... చంద్రబాబు తనకు ఒళ్లు మండుతోందంటూ ఆవేశపూరిత వ్యాఖ్యలు చేయడం, పార్లమెంటు లోపలా, బయటా టీడీపీ ఎంపీల నిరసనలతో అప్రమత్తమైంది.
ఈ క్రమంలో ప్రత్యేక హోదాపై ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేసిన నేపథ్యంలో దాని స్థానంలో భారీగా 'ప్రత్యేక సహాయం' చేయాలని కేంద్రం యోచిస్తోంది. అయితే ఈ ప్యాకేజీ ఏపీ ప్రజలను సంతోషపెట్టేలా ఉండేలా చూడాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ... కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సూచించారు.
కాగా, ఏపీకి ప్రత్యేక హోదా, మిత్రపక్షం టీడీపీలో వెల్లువెత్తుతున్న నిరసనలపై ప్రధాని నరేంద్ర మోడీతో వెంకయ్యనాయుడు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రధానితో భేటీ తర్వాత కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ వద్దకు వెళ్లిన వెంకయ్యనాయుడు.. టీడీపీ ఎంపీ, కేంద్ర మంత్రి సుజనా చౌదరిని కూడా వెంట తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా సుజనా చౌదరి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదాను మాత్రమే తమ రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నారని, దాని స్థానంలో ఎన్ని కోట్లిచ్చినా వారిని సంతోషపెట్టలేరని ఆయన నేరుగా జైట్లీకి చెప్పినట్లు సమాచారం.
దీనికి స్పందించిన అరుణ్ జైట్లీ... ఏపీ ప్రజలను తమ ప్యాకేజీతో తప్పనిసరిగా సంతోషపెడతామని, అందుకు ఒకటి, రెండు రోజులు మాత్రమే ఆగాలని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక సాయంగా పెద్ద ప్యాకేజీనే ప్రకటించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మిత్రపక్షమైతే.. నోర్మూసుకోవాలా?
బీజేపీ మాకు మిత్రపక్షమైనంత మాత్రాన.. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే నోర్మూసుకుని కూర్చోవాల్సిన అవసరం ఏ మాత్రమూ లేదని కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. ఓ టీవీ ఛానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రకారం అన్నీ చేయాల్సి వుంటుందని, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీల అమలుకు తాము పలు మార్గాల్లో ఒత్తిడి తెస్తామని ఆయన స్పష్టం చేశారు.
హోదాపై ఇప్పటికే పలుమార్లు రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ తదితరులతో మాట్లాడటం జరిగిందని, ప్రధానిని కూడా రిక్వెస్ట్ చేశామని తెలిపారు. రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితి ఎలా ఉందన్న విషయమై, ప్రధాని నివేదిక అడిగారని సుజనా తెలిపారు. ప్రత్యేక హోదాతో పాటు ఆర్థిక లోటును భర్తీ చేయాలని, పరిశ్రమలకు మరిన్ని రాయితీలు కల్పించాలని తాము డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు.