హామీ నిలబెట్టుకోండి: మోడీకి వెంకయ్య, పవన్ ప్రశ్నతో ఢిల్లీలో కదలిక!
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తెలుగువాడైన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రధాని నరేంద్ర మోడీకి బుధవారం నాడు విజ్ఞప్తి చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల పైన చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే.
ఈ రోజు ఏపీ హామీల పైన ఉన్నతస్థాయి భేటీ జరిగింది. ఈ భేటీ అనంతరం వెంకయ్య ప్రధాని మోడీని కలిశారు. ఏపీకి మనం హామీలు ఇచ్చామని, వాటిని నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. అదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి సభ పైనా చర్చ జరిగిందని తెలుస్తోంది.
జైట్లీ భేటీలో 'పవన్': మోడీ కోసమా.. జగన్ని కార్నర్ చేసేందుకా?, అందుకేనని మురళీ మోహన్
కాగా, ఉదయం సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ తదితరులు పాల్గొన్నారు.
ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీల అమలుపై మంగళవారం నాడు అమిత్ షా, అరుణ్ జైట్లీతో వెంకయ్య, సుజనా చౌదరిలు చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ రోజు ప్రధాని మోడీని వెంకయ్య కలిసి విజ్ఞప్తి చేయడం గమనార్హం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించడంతో ఢిల్లీలో కదలిక ప్రారంభమైందని అంటున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి విన్నవించుకున్న అంశాలు, సుజనా చౌదరి తయారు చేసిన ముసాయిదా నివేదికపై బుధవారం జైట్లీ, అమిత్ షాలతో వెంకయ్య సమగ్రంగా చర్చించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీపై వారం రోజుల్లో తుది నిర్ణయం వచ్చే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.
ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వెంకయ్య పయనం
ఏపీకి హోదా పైన ఢిల్లీలో నేతలతో మాట్లాడిన అనంతరం కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ పయనమయ్యారు. ఆయన ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడే అవకాశముంది.