ముప్పవరపు వెంకయ్యనాయుడు విషయంలో స్పష్టత వచ్చినట్లేగా?
కేంద్ర మంత్రిగా ముక్తార్ అబ్బాస్ నక్వీ రాజీనామా చేయడంతో ఉప రాష్ట్రపతి పదవి విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పష్టతగానే ఉన్నారని అర్థమవుతోంది. నక్వీ మోడీకి విధేయుల్లో ఒకరు. రాజ్యసభ పదవీ కాలం ముగియడంతో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. గిరిజనులను రాష్ట్రపతి పదవికి ఎంపిక చేసిన దృష్ట్యా ఈసారి మైనార్టీ వర్గాలను ఉప రాష్ట్రపతికి ఎంపిక చేయాలని భారతీయ జనతాపార్టీ అధిష్టానం ఆలోచిస్తోంది.
ఆ కోణంలో చూస్తే నక్వీకి అవకాశం రావడం ఖాయమని భావిస్తున్నారు. ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడుకు పొడిగింపు లేదనేది స్పష్టమవుతోంది. ఆయన కూడా పదవీ విరమణ చేసిన తర్వాత తన కుమార్తెకు చెందిన స్వర్ణభారతి ట్రస్ట్లో పూర్తిగా తలమునకలవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నూపుర్శర్మ చేసిన వ్యాఖ్యలపై అంతర్జాతీయ సమాజం నుంచి భారత్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలకు సరైన సమాధానమివ్వాలంటే మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తిని ఉప రాష్ట్రపతిగా ఎంపిక చేయాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలియవస్తోంది.
ఉప రాష్ట్రపతి పదవికి వెంకయ్యనాయుడికి పొడిగింపు లేదంటే దాదాపుగా ఆయన రాజకీయాల నుంచి విరమించుకున్నట్లేనని భావిస్తున్నారు. రాజ్యాంగబద్ధ పదవి నుంచి విరమించిన తర్వాత మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నవారు చాలా అరుదు. వెంకయ్యనాయుడికి కూడా 73 సంవత్సరాల వయసు ఉండటంతో స్వర్ణభారతి ట్రస్ట్ ద్వారా సమాజానికి సేవచేయాలనే ఉద్దేశంతో ఉన్నారని, రాజకీయాలతో సంబంధం లేకుండా తన విశ్రాంత జీవితం గడపాలని ఆయన కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.