జగన్ ప్రభుత్వానికి మరో గెలుపు - అమరావతి కేంద్రంగా : ఎన్నికల వేళ బిగ్ రిలీఫ్..!!
ఏపీలో ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ సీఎం జగన్ ప్రభుత్వానికి మరో గెలుపు దక్కింది. ఉద్యోగుల్లో ప్రభుత్వం పైన వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందనే ప్రచారానికి సమాధానం దొరికింది. అమరావతి కేంద్రంగా రాష్ట్ర పరిపాలనా కేంద్రంలో ప్రభుత్వ మద్దతుదారుగా ఉన్న నాయకుడినే ఉద్యోగులు మరోసారి గెలిపించారు. ఏపీ సచివాలయ సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి తిరిగి ఎన్నికయ్యారు. వెంట్రామిరెడ్డి తొలి నుంచి ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ఉంది. ఉద్యోగుల్లో ప్రభుత్వం పైన వ్యతిరేక అభిప్రాయం ఉందనే ప్రచారం నడుమ..ఈ ఎన్నికల ఫలితాలు ఉద్యోగుల మూడ్ ను స్పష్టం చేస్తాయని అంచనా అంచనా వేసారు. ఈ క్రమంలో ఇది సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన ఎన్నకే అయినా.. రాష్ట్ర వ్యాప్త చర్చకు కారణమవుతోంది.
సచివాలయ అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి..
ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం(అప్సా) అధ్యక్ష పదవిని వెంకట్రామిరెడ్డి దక్కించుకున్నారు. రెండోసారి అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. సచివాలయంలో అప్సా ఎన్నిక నిర్వహించారు. ఏపీ సచివాలయంతో పాటుగా సచివాలయం, అసెంబ్లీ, రాజ్ భవన్లోని మొత్తం 1225 మంది ఉద్యోగులకు ఓటు హక్కు ఉండగా, 1162 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అర్ద్రరాత్రి వరకు కౌంటింగ్ కొనసాగింది. అధ్యక్ష పదవితో పాటుగా మరో 8 స్థానాలకు ఎన్నిక జరిగింది. అధ్యక్ష స్థానానికి వెంకట్రామిరెడ్డి పైన జి.రామకృష్ణ పోటీ చేసారు. కాగా వెంకట్రామిరెడ్డి 228 ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు. వెంకట్రామిరెడ్డికి 720, రామకృష్ణకు 432 ఓట్లు వచ్చాయి. ప్రధాన కార్యదర్శి స్థానానికి నలుగురు పోటీ పడగా... స్వతంత్రంగా పోటీ చేసిన శ్రీకృష్ణ 20 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఉపాధ్యక్షుడిగాసీహెచ్ ఎర్రన్న యాదవ్ 147 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మహిళా ఉపాధ్యక్షురాలిగా సత్య సులోచన 52 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆరు స్థానాల్లో వెంకట్రామిరెడ్డి మద్దతు దారులు విజయం సాధించారు.
ఉద్యోగుల మూడ్ ను స్పష్టం చేస్తోందా..
గత ఏడాది ప్రభుత్వం - ఉద్యోగ సంఘాల మధ్య జరిగిన పీఆర్సీ చర్చల్లో జరిగిన ఒప్పందాలు ఉద్యుగులకు పూర్తి స్థాయిలో రుచించటం లేదు. ఆ సమయంలో ఉద్యోగ సంఘాలు అన్నీ ఏకమై సమ్మెకు సిద్దం అయ్యాయి. ప్రభుత్వం తిరిగి చర్చల ద్వారా పరిష్కారం తీసుకొచ్చింది. కానీ, ఒప్పందాలు, పెండింగ్ డీఏల విషయంలో ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. అదే సమయంలో వేతనాల ఆలస్యం కూడా ఉద్యోగుల పైన ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలోనే వచ్చే నెలలో మరోసారి పెండింగ్ అంశాల పైన ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే కార్యాచరణకు సిద్దం అవుతున్నాయి. అదే సమయంలో త్వరలోనే ఏపీ ఎన్జీఓ సంఘ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో, ఉద్యోగుల మద్దతు కూడగట్టేందుకు సంఘాల నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ క్రమంలో సచివాలయ సంఘం అధ్యక్షుడిగా ఉన్న వెంకట్రామిరెడ్డి పీఆర్సీ ఒప్పందాల వేళ ప్రభుత్వ తీరుతో విభేదించినా..ఆయన ప్రభుత్వానికి మద్దతుగా ఉంటారనే అభిప్రాయం ఉంది.
ప్రభుత్వానికి రిలీఫ్ - ఇక్కడే డేంజర్ బెల్స్
అమరావి కేంద్రంగా సచివాలయ ఎన్నికల ఫలితం ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. 1225 ఉద్యోగులకు సంబంధించి ఎన్నకే అయినా.. ఉద్యోగుల మూడ్ ను స్పష్టం చేసేదిగా పరిగణిస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వ మద్దతుదారుగా ఉన్న నేతగా గెలిచినా..ఇక్కడ అనేక సమీకరణాలు ప్రభావం చూపుతున్నాయి. ఎన్నికల సమయంలో ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల ఓట్లు కీలకం కానున్నాయి. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి సారిగా సచివాలయానికి వచ్చిన వేళ అప్పటికే తాను హామీ ఇచ్చిన 27 శాతం ఐఆర్ అమలుపై ప్రకటన చేసారు. కానీ, పీఆర్సీ వేళ తీసుకున్న నిర్ణయాలు ఉద్యోగులకు అంతగా రుచించ లేదు. ఇక, ఇప్పుడు ఉద్యోగులు ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్నారనే ప్రతిపక్షాల ప్రచారం వేళ.. ఎన్నికలు సిద్దం అవతున్న ఈ సమయంలో ఈ ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డి గెలుపు ప్రభుత్వానికి ఊరట నిచ్చే అంశం. ఇదే సమయంలో..ఉద్యోగుల్లో ఎవరు గెలిచినా.. ఎవరు ఓడినా.. వారంతా ప్రభుత్వంలో భాగస్వాములేనని..గెలుపు - ఓటములతో తమకు సంబంధం లేదని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.