ఏపీ రాజధానిలో మరో మణిహారం: 183 కి.మీ మేర ఔటర్ రింగ్ రోడ్డు
అమరావతి: ఏపీ నూతన రాజధాని ప్రాంతమైన విజయవాడ-గుంటూరు-మంగళగిరి-తెనాలి ప్రాంతాలను కలుపుతూ నిర్మించనున్న ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రతిపాదనలను రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని శుక్రవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
మొత్తం 183 కిలోమీటర్ల పొడవున్న ఈ ఔటర్ రింగ్ రోడ్డుని పీపీపీ పద్ధతిలో చేపట్టాలని ప్రభుత్వం ఆలోచనలో ఉంది. ఈ రింగ్ రోడ్డు కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 9.700 కోట్లు ఇస్తామని గతంలో ప్రకటించింది. దీంతో ఈ ఏడాది జనవరిలోనే డ్రాఫ్ట్ మ్యాప్ సిద్ధం చేసి, ప్రాథమికంగా నివేదికను కేంద్రానికి పంపింది.
8లైన్లుగా నిర్మించే ఈ రింగ్ రోడ్డు కోసం మొత్తం 4,117 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది. ఏపీ రాజధాని నిర్మాణానికి సంబంధించిన సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ను సింగపూర్ ప్రభుత్వం ఇటీవలే సీఎం చంద్రబాబుకు అందజేసిన సంగతి తెలిసిందే.
ఈ ప్రణాళికకు అనుగుణంగా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని రూపొందిచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆర్అండ్బీ, పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడుల శాఖతో పాటు ప్లానింగ్ డిపార్ట్మెంట్కు రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన బాధ్యతలను అప్పగించింది.
ఈ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వంపై ఆశలు పెంచుకోకుండా సొంతంగానే నిధులు సమీకరించుకోవాలని ఏపీ ప్రభుత్వం మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఎన్హెచ్-5, ఎన్హెచ్-9లను కలుపుతూ ఔటర్ రింగురోడ్డు ప్రణాళికను రూపొందిస్తున్నారు.
ఈ ఔటర్ రింగ్ రోడ్డు అమరావతి నుంచి మోగులూరు వద్దకు, హనుమాన్ జంక్షన్ నుంచి రామాపురం, తుమ్మలపల్లి, నందివాడ, గుడివాడ మీదుగా పామర్రు, భట్ల పెనమర్రు, కృష్ణానది మీదుగా మళ్లీ గుంటూరు జిల్లాలో ప్రవేశించే విధంగా నిర్మాణం చేపట్టనున్నారు. రింగ్ రోడ్డులో భాగంగా కృష్ణానదిపై రెండు భారీ వంతెనలు నిర్మించాల్సి ఉంది. ఇందుకు జపాన్ సహకారం కోరనున్నారు.