సూత్రధారి చంద్రబాబే, కేసు పెట్టాలి: రేవంత్ రెడ్డి ఇష్యూపై విహెచ్
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి వ్యవహారంలో ప్రధాన సూత్రధారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడేనని కాంగ్రెసు తెలంగాణ రాష్ట్ర నాయకుడు వి. హనుమంతరావు ఆరోపించారు. చంద్రబాబుపై ఎసిబి అధికారులు కేసు నమోదు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన బుధవారంనాడు హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు.
రేవంత్ రెడ్డి కేసులో చంద్రబాబు నాయుడిపై కేసు నమోదు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఆయన హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఇచ్ిచన రూ. 50 లక్షలు ఎక్కడివని ఆయన అడిగారు. వాటితో పాటు మిగిలిన రూ.4.5 కోట్లు ఎక్కడున్నాయో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
డబ్బు వ్యామోహంతోనే సోనియా రాష్ట్రాన్ని విభజించారనడం సరికాదని వీహెచ్ అన్నారు. దొరికినోడు దొంగ.. దొరకని వాడు దొరగా రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని ఆయన అభివర్ణించారు. రూ. 50 లక్షల వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని డిమాం డ్ చేశారు. బొత్స అవకాశవాది అని ఆయన అన్నారు. పార్టీకి ద్రోహం చేశారని వీహెచ్ అన్నారు. విభజన సమయంలో దమ్మున్న పిసిసి నేత ఉంటే కాంగ్రెస్కు ఇంత నష్టం జరిగేది కాదని అభిప్రాయపడ్డారు.
ఆరోపణలు రుజువు చేస్తా...
ఇదిలావుంటే, తెలంగాణ విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై నివేదిక ఇవ్వాలని పలు శాఖలకు నోటీసులు జారీ చేసినా ప్రభుత్వం స్పందించడం లేదని కాంగ్రెసు సీనియర్ నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
జగదీష్ రెడ్డిపై చేసిన అవినీతి ఆరోపణలను రుజువు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. అవినీతికి తావు లేదంటున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంత్రి జగదీష్ రెడ్డి వ్యవహారంపై విచారణ జరిపించాలని ఆయన బుధవారంనాడు డిమాండ్ చేశారు.