జగన్ హైద్రాబాద్లో సభ ఎలా పెడ్తారు: విహెచ్, సిఎంపైనా
దీనిపై విహెచ్ మంగళవారం స్పందించారు. ఆ పార్టీ నేత షర్మిల హైదరాబాదును పాకిస్తాన్తో పోల్చారని అలాంటప్పుడు ఇక్కడ సభ ఎలా పెడతారన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించని జగన్ ఇక్కడి ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో హైదరాబాదు చుట్టుపక్కల భూములను కబ్జా చేశారని ఆరోపించారు. ఇప్పుడు జగన్ ఇక్కడ సమైక్య సభ పెడితే అనవసరంగా గొడవలు జరుగుతాయని అభిప్రాయపడ్డారు. బెయిల్ పైన విడుదలైన జగన్కు అంత భారీ బందోబస్తు ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. ఈ తతంగాన్ని చూసి సాక్ష్యులు భయపడ్డారన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చివరి బంతి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. అసలు ఆడని మ్యాచ్కు బంతి వేయడమెందుకన్నారు. సమైక్య నినాదం ఎత్తుకున్న జగన్తో తెలంగాణకు లాభం లేదన్నారు. జగన్ హైదరాబాదులో సమావేశం పెడితే తాము అడ్డుకొని తీరుతామన్నారు.
శాంతిభద్రతల దృష్యా ప్రభుత్వం జగన్ సమావేశానికి అనుమతివ్వవద్దన్నారు. ఆర్థిక నేరస్థుడితో కాంగ్రెసు పార్టీ పొత్తు పెట్టుకోదన్నారు. మరోవైపు వైయస్ జగన్ హైదరాబాదులో సభ పెడితే మరో మానుకోట అవుతుందని తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. మరో మానుకోట పునరావృతం కావాలని ఆ పార్టీ కోరుకుంటుందా అని ధ్వజమెత్తారు.