భార్యాభర్తల వీడియో తీసి నెట్లో పెట్టారు: ఆమె ఆత్మహత్యాయత్నం
విజయవాడ: పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం వల్లూరుపల్లిలో కొంత మంది దుండగులు దారుణ చర్యకు పాల్పడ్డారు. దంపతులు ఇంట్లో ఉన్నసమయంలో కొందరు వ్యక్తులు వారి వీడియో తీశారు. అనంతరం ఈ వీడియో ను డబ్బులివ్వకపోతే నెట్ లో పెడతామని హెచ్చరించారు.
దంపతులు డబ్బులు ఇవ్వపోవటంతో దుండగులు నెట్లో వీడియో అప్లోడ్ చేశారు. దుండగుల చర్యతో మనస్తాపానికి గురైన మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
బాలికపై లైంగిక వేధింపులు
ఇదిలావుంటే, అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం కస్తూర్భాపాఠశాలలో 9వ తరగతి విద్యార్థినిని కానిస్టేబుల్ లైంగికంగా వేధించాడు. ఆమె పోలీస్ స్టేషన్ లో తనకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పింది. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు.
అనుమానాస్పద స్థితిలో మృతి
గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం ధాన అన్నవరం గ్రామంలో అంగన్వాడీ టీచర్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ సంఘటన శనివారంనాడు వెలుగు చూసింది. గ్రామానికి చెందిన స్వప్న (35) అంగన్వాడీ టీచర్గా పనిచేస్తోంది. ఆమె శనివారంనాడు ఉరేసుకుని మరణించింది.
ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి ఒంటిపై గాయాలున్నాయి. ఇంట్లో అక్కడక్కడ రక్తం మరకలు ఉన్నాయని అంటున్నారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.