జై భీమ్ లో సూర్య - రియల్ లైఫ్ లో గంధం చంద్రుడు - వివక్ష రహితం : నెటిజెన్ల వైరల్..!!
హీరో సూర్య జై భీమ్ చిత్రం లో కనిపించే ఒక సన్నివేశం సినిమాలో హైలైట్ గా నిలిచింది. అదే సన్నివేశం అనంతపురం జిల్లా కలెక్టర్గా గంధం చంద్రుడు పనిచేసిన సమయంలో రియల్ లైఫ్ లో ఆచరణలో పెట్టి చూపించారు. ఈ రెండు సన్నివేశాలను పోలుస్తూ ఇప్పుడు నెటిజెన్లు ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. జై భీమ్ సినిమాలో ఆ సన్నివేశంలో లాయర్ చంద్రు (సూర్య) కాలు మీద కాలు వేసుకుని ఠీవిగా న్యూస్ పేపర్ చదువుతుండగా.. అతని ఎదురుగా మరో కుర్చీలో కూర్చున్న గిరిజన చిన్నారి అతనిని అనుసరిస్తూ.. పేపరు చేతిలోకి తీసుకుంటూ... భయం భయంగా చూస్తూ ఉంటుంది.

జై భీం లో హీరో సూర్య ఆ సమయంలో
ఇంతలో చంద్రు ఆ పాపకేసి ఎవరికీ భయపడకు (నువ్వు భయపడకు.. నువ్వు అనుకున్నదే చేయి.. ఈ సమాజంలో నీకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకో.. ఆడపిల్ల అంటే ఆబల కాదు సబల అని నిరూపించుకో) అన్నట్టుగా చూస్తాడు. చంద్రు చూపుతో ఆ చిన్నారిలో ఆత్మవిశ్వాసం.. కాలు మీద కాలు వేసుకుని చేతిలో పేపరుతో ఠీవిగా కూర్చుంటుంది. అయితే, ఇప్పుడు ఆ మూవీలోని ఆ సన్నివేశం ఐఏఎస్ అధికారి గంధం చంద్రుడు గతంలో నిర్వహించిన కార్యక్రమాలతో పోలుస్తూ సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.
కలెక్టర్ గా గంధం చంద్రుడు ఇలా
అనంతపురం జిల్లా కలెక్టరుగా పనిచేసిన గంధం చంద్రుడు సామాజిక రుగ్మతలపై చిన్నతనం నుంచే యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఓ అధికారిగా బాలికల పట్ల కొనసాగుతున్న వివక్షతను.. అన్ని ప్రాంతాల్లోని బాలికలకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం, చదువుకు దూరంగా పెట్టటం.. వంటివి రూపుమాపేందుకు తన వంతు బాధ్యతను నెరవేర్చేందుకు తన వంతు బాధ్యతగా అనేక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. జై భీమ్ మూవీలో సూర్య కనిపించే ఆ సన్నివేశానికి పోలికగా..గంధం చంద్రుడు నిర్వహించిన ఒక రియల్ ప్రోగ్రాం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బాలికే భవిష్యత్తు అంటూ నాడు
11 అక్టోబర్ 2020న అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా 'బాలికే భవిష్యత్తు' అన్న వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బాలికలను ఒక్క రోజు అధికారిణులుగా మార్చే కార్యక్రమం చేపట్టారు. జిల్లా కలెక్టర్ మొదలుకొని గ్రామాల్లో ఉన్న చిన్న స్థాయి అధికారి వరకు ఒక్కరోజు బాలికలను అధికారులుగా మార్చారు. దీని ద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని వెయ్యి రెట్లు పెంచే ప్రయత్నం చేసారు. వారిలో నేనేమైనా సాధించగలను అన్న విశ్వాసాన్ని కలిగించారు.

రెండింటినీ పోలుస్తూ సోషల్ మీడియాలో వైరల్
వారిచేత సమస్యలను పరిష్కరించేలా చేసి, ఆ బాలికలు చూపిన సహేతుకమైన పరిష్కారాలను అమలు అయ్యేలా చూశారు. కలెక్టర్గా ఆయన చేసిన ఈ పని ఎన్నో రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధులను ఆలోచింపజేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు అందుకున్నాయి. జై భీమ్ మూవీలో ఏ విధంగా అమ్మాయిని పక్కన కూర్చోపెట్టుకొని ధైర్యం ఇస్తాడో, నిజ జీవితంలో చంద్రుడు అంతకంటే ఎక్కువగా చేసి చూపించారు. ఇప్పుడు ఈ రెండు సంఘటనలు వైరల్ గా మారాయి.












Click it and Unblock the Notifications