చంద్రబాబుకు షాక్ .. కుప్పంలో ఉప కాలువ అక్రమాల లెక్క తేల్చే పనిలో విజిలెన్స్ అధికారులు
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి టిడిపి అధినేత మాజీ సీఎం చంద్రబాబును టార్గెట్ చేశారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికి తీసే పనిలో ఉన్నారు. అందులో భాగంగా తాజాగా చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పం నియోజకవర్గంలో ఉప కాలువ పనుల అక్రమాలపై దృష్టిసారించారు. ఇక దీనితో ప్రస్తుతం మాజీ సీఎం చంద్రబాబుకు సొంత నియోజక వర్గంలో షాక్ ఇచ్చినంత పని అయింది.

కుప్పంలో గత ప్రభుత్వ హయాంలో ఉపకాలువ నిర్మాణాలకు అదనపు చెల్లింపులు
మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ ఉప కాలువ పనులకు సంబంధించి అక్రమాలు జరిగాయని, అదనపు చెల్లింపులు చేశారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తీసుకు వెళ్లే ఈ ఉప కాలువ నిర్మాణానికి సంబంధించి 430. 26 కోట్ల రూపాయల పనులకు, అదనంగా 144 .7 కోట్ల రూపాయలు చెల్లించడంపై పరిశీలన జరిపేందుకు వైసిపి ప్రభుత్వం ఆగస్టు 13వ తేదీన సెలెక్ట్ కమిటీని నియమించింది. ఇక ఆ నిపుణుల కమిటీ నిజానిజాల నిగ్గు తేల్చే పనిలో పడింది.

రంగంలోకి విజిలెన్స్ మరియు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు
ఇక ఈ నేపధ్యంలోనే విజిలెన్స్ మరియు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఈ పనుల పై దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన కాలువ పనులు క్షేత్రస్థాయిలో ఎలా జరిగాయో పరిశీలించడానికి విజిలెన్స్ మరియు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్ రాజేంద్రనాథ్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన నేడు కాలువ పనులను పరిశీలించనున్నారు. ఇక దీంతో కుప్పం ఉపకాలువకు సంబంధించిన అధికారులలోనూ,ఈ పనులను నిర్వహించిన కాంట్రాక్టు సంస్థల్లోనూ ఆందోళన నెలకొంది.

రెండు రోజులుగా రికార్డుల పరిశీలన
గత రెండు రోజులుగా కుప్పం ఉప కాలువకు సంబంధించిన పనుల విషయంలో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డిప్యూటీ ఇంజనీర్,ముగ్గురు జేఈలు తనిఖీలు చేపట్టారు. అన్ని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మదనపల్లెలోని ఎస్సీ కార్యాలయంలో ఉన్న పత్రాలను చాలా నిశితంగా పరిశీలిస్తున్న అధికారులు ఏయే పనులను రికార్డు చేశారు. ఇక ఈ ఉప కాలువ పనులు నిబంధనల మేరకు కొనసాగాయా లేదా అన్న అంశాలను సైతం పరిశీలిస్తున్నారు. ఇక నేడు డైరెక్టర్ జనరల్ కాలువ పనులను పరిశీలించనుండటంతో ఆ శాఖ అధికారులు ముందస్తుగా నివేదికలు సిద్ధం చేసుకున్నారు.

నేడు ఉన్నతాధికారుల క్షేత్ర స్థాయి పరిశీలన
నేడు ఉన్నత అధికారులు పరిశీలన చెయ్యనున్న నేపధ్యంలో పలమనేరు, కుప్పం నియోజకవర్గాల పరిధిలో జరిగిన పనుల్లో ఏఏ పనులు పరిశీలిస్తారో అని అధికారులు అన్ని నివేదికలు సిద్దం చేశారు. ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమయ్యారు. ఎత్తిపోతలు, కాలువ, కాంక్రీటు నిర్మాణాలను పరిశీలించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. పనులు డీపీఆర్ మేరకు చేశారా లేదా, అంచనాలు ఎలా పెంచుకున్నారు, తదితర అంశాలపై పరిశీలన చేసే ఆలోచనలో ఉన్నారు అధికారులు .

అక్రమాలలో కాంట్రాక్టు సంస్థలతో పాటు ఎంపీ సీఎం రమేష్ పాత్ర ?
కుప్పం కాలువ పను ల అంచనా నుంచి అదనపు చెల్లింపు వ్యవహారం వరకు గత ప్రభుత్వ కనుసన్నల్లోనే జరిందని ప్రస్తుత సర్కార్ భావిస్తుంది. . ఈపీసీ ద్వారా 4 శాతం అదనంగా కోట్ చేసి రూ.430.26 కోట్లకు పనులు దక్కించుకున్న జాయింట్ వెంచర్ సంస్థలు ఒప్పందం మేరకు 123.641 కిలోమీటర్ల కాలువ తవ్వకం చెయ్యాల్సి వుంది. అంతే కాదు 324 స్ట్రక్చర్స్, 5 చోట్ల ఎన్హెచ్ క్రాసింగ్ పనులు, 3 చోట్ల ఎత్తిపోతల పథకాల నిర్మాణం, 110 చెరువులకు నీరు అందించే పనులు పూర్తి చెయ్యాల్సి ఉంది. ఇక ఈ పనులుఒప్పందం మేరకు 9 నెలల్లో పూర్తి చేయాల్సి ఉండగా నేటికీ పూర్తి కాలేదు . అంతే కాదు ఈ నిర్మాణ పనుల అక్రమాలలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్కు భాగస్వామ్యం ఉందని భావిస్తున్న వైసీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో లెక్క తేల్చే పనిలో పడింది.












Click it and Unblock the Notifications