విజయ సాయి చక్రం: జగన్కు మైసూరా రాంరాం వెనుక కారణాలెన్నో!
విజయవాడ: సీనియర్ రాజకీయ నాయకుడు మైసూరా రెడ్డి బుధవారం నాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయని అంటున్నారు. అందులో విజయ సాయి రెడ్డి కూడా ఓ కారణంగా చెబుతున్నారు.
ఇప్పటికే వైసిపి నుంచి ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో కారణంతో వదిలేసి టిడిపిలో చేరుతున్నారు. మైసూరా కూడా వైసిపిని వదిలేసి టిడిపిలో చేరుతారనే ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ అహంకారపూరితంగా వ్యవహరిస్తారని, ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వరని, తమ మాటకు విలువ ఇవ్వడం లేదని, కొందరు వచ్చాక తమకు ప్రాధాన్యత లేకుండా పోయిందని, నియోజకవర్గ అభివృద్ధి కోసం తాము టిడిపిలో చేరుతున్నామని.. ఇప్పటి దాకా సైకిల్ ఎక్కిన పలువురు ప్రజాప్రతినిధులు చెప్పిన కారణాలు.
అలాగే, మైసూరా రెడ్డి కూడా జగన్కు దూరం కావడం వెనుక పలు కారణాలు ఉన్నాయని అంటున్నారు. అక్రమాస్తుల కేసులో జగన్ అరెస్టయ్యాక పార్టీని మైసూరా రెడ్డి అట్టిపెట్టుకొని కాపాడారు. అయినప్పటికీ ఆ తర్వాత తనకు ప్రాధాన్యత లేకుండా పోయిందని మైసూరా అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు.
ముఖ్యంగా, ఆడిటర్ విజయ సాయి రెడ్డి పార్టీలో చేరాక.. ఆయన ప్రాధాన్యత పెరుగుతోందని అంటున్నారు. విజయ సాయి రెడ్డి పార్టీలో చక్రం తిప్పుతుండటం, మైసూరా రెడ్డికి క్రమంగా ప్రాధాన్యత తగ్గుతోందని, అందుకే ఆయన దూరం జరగాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు.
విజయ సాయి చేరిక తర్వాత మైసూరాకు ప్రాధాన్యత క్రమంగా తగ్గుతూ వచ్చిందని అంటున్నారు. అదే సమయంలో రాజ్యసభ స్థానం కేటాయింపులోను అన్యాయం జరిగిందని ఆవేదనగా ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు, రాయలసీమ విషయంలోను జగన్ చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని మైసూరా భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ కారణాల వల్లే ఆయన పార్టీని వీడారని అంటున్నారు.