పప్పు నాయుడు రాజకీయ జీవితం ముగిసినట్లే: చంద్రబాబుపై విజయసాయి తీవ్ర విమర్శలు
అమరావతి: ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్పై ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు రాజధానులను తీసుకొస్తుంటూ చంద్రబాబు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

పప్పు నాయుడు రాజకీయ జీవితం ముగిసినట్లే..
‘అహంకారం, దుర్భుద్ధితో చంద్రబాబు వేసిన ఒక్కో తప్పటడుగు పార్టీని, నమ్ముకున్న వాళ్లని అధ:పాతాళానికి నెట్టి వేసింది. ఈ వయసులో శక్తికి మించిన విన్యాసాలు చేస్తున్నాడు. పప్పు నాయుడు రాజకీయ జీవితం కూడా ముగిసినట్టే. యనమల లాంటి తిరస్కృతులకు చరమాంకం చేదు జ్ఞాపకంగా మిగులుతుంది'అని విజయసాయి విమర్శించారు.

చంద్రబాబూ.. వాళ్ల జీవితాలు బలికావాల్సిందేనా..?
‘ఉత్తరాంధ్ర, రాయలసీమ వాళ్లు ఇన్నాళ్లు టిడిపిని ఆదరించినందుకు కోలుకోలేనంత దెబ్బకొట్టాలని చూస్తున్నావు గదా బాబూ! వెనకబడిన ఈ ప్రాంతాలు ఎప్పటికీ నీ కాలికింద చెప్పులాగే పడి ఉండాలా? నీ ధన దాహానికి వాళ్ల జీవితాలు బలికావాల్సిందేనా?' అంటూ విజయసాయి మండిపడ్డారు.

బాబు, యనమల కలిసి ఆనాడు..
‘ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచే ప్రణాళికలో భాగంగా అప్పట్లో యనమలని స్పీకర్గా తెరపైకి తీసుకొచ్చాడు బాబు. బాస్ సిఎం కావడానికి స్పీకర్ స్థానంలో ఉండి ఆయన ‘చరిత్రలో నిల్చేంత' సేవ చేశారు. ఇప్పుడు కౌన్సిల్ ఇమేజిని కూడా బాబు తన స్వార్థం కోసం మంట కలిపేశారు' అంటూ విజయసాయి దుయ్యబట్టారు.
తెలంగాణ ఎంపీ సవాల్ స్వీకరించిన విజయసాయి
తెలంగాణ టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ తాను స్వీకరిస్తున్నట్లు విజయసాయి రెడ్డి ప్రకటించారు. జనవరి 28న విశాఖపట్నంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్ అందించాలని కోరారు.
మా వాళ్లను కాపాడండి..
ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమ రవాణా ద్వారా కువైట్ తరలించబడిన బాధిత మహిళలు ఇప్పుడు కువైట్ ఎంబసీలో ఉన్నారని. వారిని తిరిగి రాష్ట్రానికి రప్పించేందుకు సాయం చేయాలని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ను కోరారు విజయసాయి రెడ్డి.












Click it and Unblock the Notifications