చంద్రబాబుపై విజయ సాయి నిప్పులు, వీడియో లింక్ చేస్తామని..
విజయనగరం: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోని అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలోని అభివృద్ధికి మధ్య ఉన్న తేడా ప్రజలకు తెలియజేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డి గురువారం అన్నారు.
హుధుద్ తుఫాను నేపథ్యంలో జిల్లాలో మృతి చెందిన 15 మంది కుటుంబ సభ్యులకు పార్టీ జిల్లా అధ్యక్షుని చేతుల మీదుగా రూ.50వేల సహాయం అందజేశారు. ఈ సందర్భంగా విజయ సాయి రెడ్డి నాయకులతో మాట్లాడారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు.
చిత్తశుద్ధి ఉన్న కార్యకర్తలను గుర్తించాలన్నారు. ప్రతి కార్యకర్తకు రానున్న నాలుగేళ్లలో పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సేవలకు గుర్తింపు లభిస్తుందన్నారు. ప్రతి జిల్లా కార్యాలయంలో కేంద్ర కార్యాలయంతో పాటు వీడియో లింక్తో అనుసంధానం చేస్తామన్నారు.
డిసెంబర్ 5న జిల్లా కేంద్రాలలో జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలన్నారు. విజయనగరం జిల్లాలో వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో మూడు సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించారని చెప్పారు. జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజీతో సహా నాలుగు కోట్ల రూపాయలతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేశారని చెప్పారు.
20,033 ఎకరాలను నిరుపేదలకు పంచారని తెలిపారు. రెండు లక్షల ఎనభై ఒక్కవేల మందికి అదనంగా పెన్షన్లు మంజూరు చేశారన్నారు. చంద్రబాబు వచ్చిన ఆరు నెలల్లోనే జిల్లాలో 1155 కోట్ల రూపాయలకు సంబంధించి ఒక్క రూపాయి వడ్డీ చెల్లించలేదన్నారు. ఆధార్ లేదన్న సాకుతో 45వేల మంది రైతలను రుణమాఫీ జాబితా నుండి తొలగించారన్నారు. బాబు వచ్చాక ఫ్యాక్టరీలు మూతపడ్డాయని, కార్మికులు రోడ్డున పడ్డారన్నారు.