రఘురామను అనుమతించవద్దు - విజయసాయిరెడ్డి లేఖ..!!
వైసీపీ వర్సెస్ రఘురామ రాజు వ్యవహారం కొత్త మలుపు తీసుకుంటోంది. రఘురామ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన పైన అనర్హత వేటు కోసం వైసీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ నేతలకు చేతైనైతే తన మీద అనర్హత వేటు వేయించాలంటూ రఘురామ సవాల్ చేస్తున్నారు. అయితే, ఈ వ్యవహారం పైన ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం వెలువడ లేదు. ఈ వ్యవహారం ప్రస్తుతం పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ వద్ద పెండింగ్ లో ఉంది. ఇదే సమయలో జూలై 4న ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు వస్తున్నారు.

ప్రధాని పర్యటన వేళ.. రఘురామ అంశం
భీమవరంలో జరిగే అల్లూరి సీతారామ రాజు 125వ జయంతోత్సవాల్లో పాల్గొంటారు. భీమవరం నియోజకవర్గం నర్సాపురం పార్లమెంట్ పరిధిలో ఉండటంతో..స్థానిక ఎంపీగా ప్రధాని పాల్గనే కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించాల్సి ఉంటుంది. అయితే, సీఎం జగన్ సైతం ఆ కార్యక్రమం లో ప్రధానితో పాటుగా వేదిక పంచుకోనున్నారు. రఘురామ తాను హాజరు అవుతున్నట్లు చెబుతున్నారు. తాను ఆ కార్యక్రమానికి వచ్చి వెళ్లిపోతానని..పిచ్చి వేషాలు వేయద్దంటూ హెచ్చరిస్తున్నారు. కానీ, ఈ విషయం పైన ఇంకా సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. ఇప్పుడు తాజాగా.. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి రాసిన ఒక లేఖ పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతోంది.

ఎంపీ విజయ సాయిరెడ్డి లేఖతో
ఎంపీ రఘురామకృష్ణరాజును సంసద్ టీవీ డిబేట్లకు అనుమతించవద్దని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సంసద్ టీవీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సంసద్ టీవీ సీఈవోకి లేఖ రాశారు. రఘురామ రాజు సంసద్ టీవీ నిర్వహించిన చర్చల్లో పాల్గొనడం గమనించానని, అతనిపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు వేయాలని కోరుతూ చేసిన ఫిర్యాదు లోక్సభ స్పీకర్ వద్ద పెండింగ్లో ఉందని విజయసాయి రెడ్డి తన లేఖలో వివరించారు. దీనికి కొనసాగింపుగా.. ఆయన అభిప్రాయాలు పక్షపాత ధోరణిలో ఉంటాయని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా వైఎస్సార్సీపీ అభిప్రాయాలకు ఆయన బాధ్యత వహించడం లేదని తెలిపారు.

అనర్హత అంశం పెండింగ్ లో
రానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనూ, అదేవిధంగా ఆయన పదవీకాలం పూర్తయ్యేంత వరకు, ఏపీ ప్రభుత్వం, వైఎస్సార్సీపీ తరఫున సంసద్ టీవీ డిబేట్లలో రఘురామను అనుమతించవద్దని సాయిరెడ్డి తన లేఖలో కోరారు. అయితే, తనను బహిష్కరించుకుండా చర్చల్లో అనుమతించ వద్దంటూ లేఖలు రాయలేరని రఘురామ చెబుతున్నారు. కావాలంటే తనను పార్టీ నుంచి బహిష్కరించాలని సూచిస్తున్నారు. మరి, సాయిరెడ్డి రాసిన లేఖను సంసద్ టీవీ సీఈవో పరిగణలోకి తీసుకుంటారా.. ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.












Click it and Unblock the Notifications