ఫిరాయింపులపై జగన్ ఆందోళన, ఢిల్లీలో రంగంలోకి విజయ సాయి
న్యూఢిల్లీ: వచ్చే పార్లమెంటు సమావేశాల్లో పార్టీ ఫిరాయింపుల చట్టం పైన ప్రయివెంటు మెంబర్ బిల్లు ప్రవేశ పెడతామని వైసిపి రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి మంగళవారం నాడు చెప్పారు. అలాగే విభజన చట్టంలోని హామీల పైన కేంద్రాన్ని నిలదీస్తామని చెప్పారు.
కాగా, ఇటీవల వైసిపి నుంచి పలువురు ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్న విషయం తెలిసిందే. ఇది వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆందోళనగా మారింది. పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో కొత్త చట్టాన్ని తీసుకు రావాలని జగన్ పలుమార్లు డిమాండ్ చేశారు. ఇప్పుడు, విజయ సాయి రాజ్యసభకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయన కొత్త చట్టం కోసం పోరాడుతామని చెప్పారు.
తెలుగు రాష్ట్రాల నుంచి కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన సురేశ్ ప్రభు, విజయ సాయి రెడ్డి, తెలంగాణ నుంచి ఎన్నికైన డి శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతారావుతో రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం విజయ సాయి మీడియాతో మాట్లాడారు.
పీవీయే స్ఫూర్తి: కేవీపీ, ఉత్తమ్
క్లిష్ట పరిస్థితుల్లోను సడలని వ్యక్తిత్వం దివంగత పీవీ నర్సింహా రావుది అని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్ర రావు అన్నారు. పీవీ భూసంస్కరణలే కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకును తెచ్చిపెట్టాయని ప్రశంసించారు. ఆయన రాజనీతి సంస్కరణలు మరవలేనివని చెప్పారు. పీవీ స్ఫూర్తితోనే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తోందని టిపిసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.