ఏ ఫార్ములా వాడుతున్నారో చెప్పండి: రాజ్యసభలో విజయ సాయి రెడ్డి ప్రశ్న
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయ సాయి రెడ్డి సోమవారం నాడు రాజ్యసభలో బొగ్గు ధరల పైన ప్రశ్నించారు.
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయ సాయి రెడ్డి సోమవారం నాడు రాజ్యసభలో బొగ్గు ధరల పైన ప్రశ్నించారు. దిగుమతి చేసుకుంటున్న బొగ్గు ధరల హెచ్చుతగ్గుల నుంచి అల్ట్రా మెగా పవర్ ప్లాంట్లను బయటపడేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందా లేదా చెప్పాలని సభలో ప్రశ్నించారు.
బాబుకు ఝలక్: 'ఆ సర్వే అంతా ఊహాజనితం', సీనియర్లతో జగన్ అత్యవసర భేటీ!
అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ల (యూఎంపీపీ) లో వాడుతున్న దిగుమతి బొగ్గుకు ఇండెక్స్ ధరలు నిర్ణయించడానికి ఏ ఫార్ములా వాడుతున్నారో చెప్పాలని అడిగారు. కొత్త విధానంతో ముంద్రా, కృష్ణపట్నంలో ఉన్న పవర్ ప్లాంట్లకు లబ్ధి చేకూరుతుందో లేదోచెప్పాలన్నారు.
విజయ సాయి రెడ్డి ప్రశ్నలకు కేంద్ర విద్యుత్, బొగ్గు గనుల సహాయ మంత్రి సమాధానం ఇచ్చారు. వాటాదారుల సంప్రదింపులు, స్టాండర్డ్ బైండింగ్ డాక్యుమెంట్ల ప్రకారం నిపుణుల కమిటీ రిపోర్టును రూపొందించిందన్నారు.
దేశీయ కోల్ బ్లాక్ల కేటాయింపులకు అనుగుణంగా అల్ట్రా మెగా పవర్ ప్లాంట్లకు మార్గదర్శకాలను రూపొందించామన్నారు. యూఎంపీపీల కోసం బొగ్గు దిగుమతులు ఇంకా ఖరారులోనే ఉన్నాయన్నారు. కాగా, నోట్ల రద్దు రగడ నేపథ్యంలో సోమవారం నాడు ఉభయ సభలు మంగళవారానికి వాయిదాపడ్డాయి.