ముసలినక్క; ముష్టినాయుడు.. బతికుండగానే భూతంలా జనాలకు హింస: చంద్రబాబుపై సాయిరెడ్డి ఫైర్
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ ల పై సోషల్ మీడియా వేదికగా నిత్యం విరుచుకు పడుతూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మట్టి, ఇసుక, బాక్సైట్, గ్రానైట్ తవ్వకాలపై అధికార వైసిపికి తెలుగుదేశం పార్టీకి మధ్య కొనసాగుతున్న రగడ నేపథ్యంలో చంద్రబాబును టార్గెట్ చేస్తూ విజయ సాయి రెడ్డి విరుచుకుపడ్డారు.
దోపిడీకి అవకాశం కోల్పోయామని గంగవెర్రులెత్తుతోంది టీడీపీ
మట్టి, ఇసుక, బాక్సైట్, గ్రానైట్ అక్రమ తవ్వకాలే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్న పచ్చ కుల పార్టీ అధికారం పోయాక దోపిడీకి అవకాశం కోల్పోయామని గంగవెర్రులెత్తుతోంది అంటూ ట్విట్టర్ వేదికగా తెలుగుదేశం పార్టీ ని టార్గెట్ చేశారు. పన్ను చెల్లించకుండా గ్రానైట్ తరలించి వందల కోట్ల పన్నులు ఎగవేసిందెవరు? ముష్టి నాయుడు బాబూ? అంటూ చంద్రబాబు విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
పచ్చపార్టీ నాయకుల ఆస్తులన్నీ ఆక్రమణలే
ఇదే సమయంలో 14 ఏళ్లు సీఎంగా చేశానని పదేపదే చెప్పుకునే వ్యక్తి ప్రభుత్వ భూముల ఆక్రమణదారులకు వత్తాసు పలకడం దిగజారుడుకు పరాకాష్ట అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. నదిని పూడ్చి కట్టిన కరకట్ట నివాసం నుంచి పార్టీ ఆఫీసులు, పచ్చపార్టీ నాయకుల ఆస్తులన్నీ ఆక్రమణలే అంటూ ఆరోపించారు. అయినా దెయ్యాలు వేదాలు వల్లిస్తూనే ఉంటాయి అని విజయసాయి రెడ్డి తెలుగుదేశం పార్టీ నేతలను టార్గెట్ చేశారు.
చంద్రబాబు ముసలి నక్క... ప్రజలను హింసించే భూతం
అంతేకాదు కోరికలు తీరకుండానే పోయినవారి ఆత్మ పిశాచిరూపంలో తిరుగుతుందని పెద్దలు చెబుతుంటారు అని పేర్కొన్న విజయసాయిరెడ్డి చంద్రబాబును భూతం అంటూ టార్గెట్ చేశారు. ముసలి నక్క- 73, బతికిండగానే భూతం అవతారం ఎత్తి జనాన్ని హింసిస్తున్నాడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డెకాయిట్ల, భూ కబ్జాదారులను కాపాడటమే కర్తవ్యంగా పెట్టుకున్నాడు. "బ్లాక్" మ్యాజిక్ స్లీపర్ సెల్స్ ఆయన బలం అని విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు.
పేదల నోరుకొట్టి పెద్దోళ్లకు దోచిపెట్టిన చరిత్ర గుంట నక్కది
అంతకుముందు ఈ ఒక్క ఫోటో చాలు నక్క నాయుడు జీవితాంతం కుళ్లి కుళ్లి ఏడవటానికి అంటూ ఓ ఫోటోను పోస్ట్ చేసిన విజయసాయిరెడ్డి ఇలాంటి కోటి మంది కళ్లల్లో వెలుగులు నింపారు జగన్ అని పేర్కొన్నారు. పేదల నోరుకొట్టి పెద్దోళ్లకు దోచిపెట్టిన చరిత్ర గుంట నక్కది అంటూ చంద్రబాబు ని విమర్శించారు. 1998లోడిఎస్సీలో అర్హత సాధిస్తే నియామకాలు నిలిపేసి కక్ష సాధించాడు. వాళ్ల భవిష్యత్తును చిదిమేశాడు అని చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.