లోకేష్ శుద్ధ బద్దకానికిదే నిదర్శనం, రాహుల్తో బ్రాహ్మణి భేటీనా?: విజయసాయి తీవ్ర విమర్శలు
హైదరాబాద్: ఏపీ మంత్రి నారా లోకేష్పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. లోకేష్ ఆయన ఇంటి పైకప్పు మీదే పోలీసుల గౌరవ వందనంతో జాతీయ పతాకాన్ని ఎగురవేయడానికి ఆయన బద్ధకానికి, అధికార దుర్వినియోగానికి నిదర్శనమని ట్విట్టర వేదికగా దుయ్యబట్టారు.
లోకేష్ శుద్ధ బద్ధకానికి నిదర్శనం
‘స్వాతంత్య్ర దినోత్సవం రోజు పోలీసులతో గౌరవ వందనం అందుకుని ఇంటి పైకప్పు మీదే జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి లోకేశ్ నాయుడు ఒక్కరే. ఇది ఆయన శుద్ధ బద్ధకానికి, తీవ్ర అధికార దుర్వినియోగానికి నిదర్శనం' అని ట్వీట్ చేస్తూ దీనికి సంబంధించిన ఫోటోలను విజయసాయిరెడ్డి విడుదల చేశారు.
ఎంత తిన్నామన్నదే ముఖ్యం
‘కేంద్రం ఇచ్చిన గ్రాంటును రాష్ట్రం తిరిగి కట్టనక్కర లేదు. అదే అమరావతి బాండ్ అని మీరు తెచ్చిన డబ్బులు వడ్డీ సహా తిరిగి కట్టాలి. ఈ రెండింటినీ మీరెందుకు ఒకేలా చూస్తున్నారో ప్రజలకు అర్థమైంది. గ్రాంట్ అయినా, బాండైనా మీకు అనవసరం. అందులో ఎంత తిన్నాం అన్నదే మీకు ముఖ్యం' అని లోకేశ్ను ఉద్దేశించి విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.
రాహుల్, బాబు నీచ రాజకీయాలు
‘దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్రెడ్డిపై రాహుల్గాంధీ అధికార దురహంకారంతో కేసులు పెట్టించి గతంలో అన్యాయంగా జైలు పాలు చేశారు. అదే ఈరోజు చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణిని రాహుల్ కలుసుకున్నారు. ఇది దేనికి నిదర్శనం? రాహుల్గాంధీకి నీచ రాజకీయాలు మాత్రమే తెలుసని, ఎంతకైనా దిగజారతారని తెలియజేస్తోంది' అని ట్విట్టర్లో విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేరస్తులకు అండగా చంద్రబాబు
అవినీతి, అసమర్థ చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి ఉద్వాసన పలికినపుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిజమైన స్వాతంత్య్రం లభిస్తుందని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్న టీడీపీ నేతలకు అండగా ఉంటున్నారని ఆరోపించారు. పల్నాడు అక్రమ మైనింగ్ వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని కీలకంగా ఉన్నారని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వంలో అనేక అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయినప్పుడే ఏపీ మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.